ఆసిఫాబాద్అర్బన్: కెరమెరి, జైనూర్, సిర్పూర్(యు), లింగాపూర్ మండలాలకు చెందిన రైతులతో కలిసి ఎమ్మెల్యే కోవ లక్ష్మి సోమవారం హైదరాబాద్లో ఫారెస్ట్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ సి.సువర్ణను కలిసి సమస్యలు వివరించారు. వందలాది కుటుంబాలు 50 ఏళ్లుగా అటవీ ప్రాంతాల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాయని తెలిపారు. అటవీశాఖ చర్యలతో సాగు భూములు కో ల్పోతే వారు రోడ్డున పడే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఇప్పటికే విత్తనాలు వేసి సాగు ప్రారంభించిన రైతుల చేలకు అధికారులు వెళ్లి ఇబ్బందులు కలిగించకుండా ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందించారు.


