ఆసిఫాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలో ఈ నెల 21న నీట్ నిర్వహించే జన్కాపూర్ తెలంగాణ సాంఘిక సంక్షేమ పాఠశాల, కళాశాల(జిల్లా అటవీశాఖ కా ర్యాలయం) వద్ద నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని ఎస్పీ నితిక పంత్ ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష నిర్వహణ సక్రమంగా కొనసాగేందుకు 163 బీఎన్ఎస్ఎస్(144 సెక్షన్) అమలు చేస్తామన్నారు. పరీక్షకు ఎలాంటి ఆటంకం లేకుండా పోలీసుశాఖ ఆధ్వర్యంలో పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఆదివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు విద్యార్థులను కేంద్రంలోకి అనుమతిస్తారని, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రం పరిసరాల్లో వ్యక్తులు గుంపులుగా ఉండొద్దని, సభలు సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు పూర్తిగా నిషేధమని స్పష్టం చేశారు. 500 మీటర్ల పరిధిలోని అన్ని జిరాక్స్ సెంటర్లు ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మూసి ఉంచాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పరీక్ష కేంద్రం తనిఖీ
ఆసిఫాబాద్రూరల్: జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసే నీట్ కేంద్రాన్ని శుక్రవారం ఎస్పీ నితిక పంత్ తనిఖీ చేశారు. పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు, భద్రత చర్యలు, సీసీ కెమెరాల పనితీరు గురించి తెలుసుకున్నారు. డీఎస్పీ అశోక్, సీఐ బాలాజీ వర ప్రసాద్, ప్రిన్సిపాల్ రహీం తదితరులు పాల్గొన్నారు.


