ఆసిఫాబాద్: కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడి వేధింపులకు గురైన మైనర్ బాలికకు న్యాయం చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని తన నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బండి భగీరథ్ అరాచకాలపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పెదవి విప్పడం లేదని, ఆ పార్టీ నాయకుల మౌనం వెనుక మతలబు ఏమిటని ప్రశ్నించారు. కుమారుడి ఆగడాలకు నైతిక బాధ్యత వహిస్తూ బండి సంజయ్ వెంటనే రాజీనామా చేయాలని, కేంద్ర ప్రభుత్వం ఆయనను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఆధారాలు బయటపడినా నిందితుని అరెస్టు చేయడంలో కాలయాపన మండిపడ్డారు. మొదట ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా బాధితురాలిని బెదిరించడం వెనుక ఉన్న రాజకీయ శక్తులెవరని ప్రశ్నించారు. బాలికకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ పక్షాన అండగా ఉంటామని స్పష్టం చేశారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ మెంగ్రె ఆకాశ్, వైస్ చైర్మన్ అహ్మద్, నాయకురాలు మర్సోకోల సరస్వతి, రెబ్బెన పీఏసీఎస్ చెర్మన్ కార్నాథం సంజీవ్, రాజంపేట సర్పంచ్ బుర్స పోచయ్య, నాయకులు జాబరి రవీందర్, సాలంబిన్ అహ్మద్, మామిడి లక్ష్మి, అహ్మద్, అశోక్, నిస్సార్, అన్సార్, సమద్, నారాయణ, వాజిద్, శ్రవణ్, జీవన్ పాల్గొన్నారు.


