ఆసిఫాబాద్: వరి ధ్యానం కొనుగోళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సూచించారు. శనివారం హైదరాబాద్ నుంచి ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో విద్యావారోత్సవాలు, ధాన్యం కొనుగోళ్లు, రైతు నమోదు అంశాలపై కార్యదర్శి మాట్లాడారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. రైతు నమోదు ప్రక్రియ అన్ని జిల్లాల్లో వందశాతం పూర్తయ్యేలా చూడాలని సూచించారు. జనగణన–2027లో భాగంగా ఈ నెల 10నుంచి ఇళ్లగణన చేపట్టనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 10 లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగులున్నారని, వీరంతా స్వీయగణన చేసుకోవాలని ఆదేశించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ నెల 11నుంచి నిర్వహించనున్న విద్యావారోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి అదనపు కలెక్టర్ డేవిడ్ అధికారులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో రైతు నమోదు ప్రక్రియ సక్రమంగా జరుగుతోందని తెలిపారు. వరి ధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. విద్యా వారోత్సవాలు, ఇళ్ల గణన కార్యక్రమం సమర్థవంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.


