జీరో బిల్లుకు చిల్లు..! | - | Sakshi
Sakshi News home page

జీరో బిల్లుకు చిల్లు..!

May 8 2026 12:25 PM | Updated on May 8 2026 12:25 PM

200 యూనిట్లకు మించి విద్యుత్‌ వినియోగిస్తే పూర్తి బిల్లు చెల్లించాల్సి వస్తుంది. తద్వారా నెలకు రూ.900 నుంచి రూ.1000 వరకు భారం పడుతుంది.

లబ్ధిదారులు తప్పనిసరిగా పొదుపు మంత్రం పాటించాలని విద్యుత్‌ అధికారులు సూచిస్తున్నారు. అవసరానికి మించి ఎలక్ట్రానిక్‌ వస్తువులు వాడకుండా ఉంటే మంచిది.

ఇళ్లలో సాధారణ బల్బులకు బదులు తక్కువగా విద్యుత్‌తో ఎక్కువ వెలుతురు అందించే ఎల్‌ఈడీ బల్బులు వినియోగించుకోవాలి. గదిలో అవసరమైతేనే ఫ్యాన్లు, లైట్లు వాడుతూ.. ఎవరూ లేని సమయంలో ఆఫ్‌ చేయాలి.

ఎలక్ట్రికల్‌ రైస్‌ కుక్కర్లకు బదులు ప్రెషర్‌ కుక్కర్లును వినియోగించుకోవాలి.

తడిబట్టలను ఎలక్ట్రికల్‌ ఐరన్‌ బాక్స్‌లతో ఇసీ్త్ర చేయడంతో మీటర్‌ గిర్రున తిరుగుతుంది. పొడి బట్టలను ఇసీ్త్ర చేయడం మూలంగా కాస్త ఆదా చేయొచ్చు.

వేసవిలో ఎలక్ట్రిక్‌ వాటర్‌ హీటర్స్‌ వినియోగించకుంటే మేలు..

జిల్లాలో గణనీయంగా పెరిగిన విద్యుత్‌ వినియోగం ఏప్రిల్‌లో గృహజ్యోతికి దూరమైన 3,080 మంది లబ్ధిదారులు ఈ నెలలో మరింత పెరిగే అవకాశం పొదుపు పాటించాలని అధికారుల సూచన

రెబ్బెన: అధిక ఉష్ణోగ్రతలు, మండుతున్న ఎండలు, ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మార్చి నుంచి ఎండలు పెరగగా, ఏప్రిల్‌ నెలాఖరు నాటికి 40 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరుకున్నాయి. ఇక మే ప్రారంభంలోనే 45 డిగ్రీ దాటడంతో ప్రజలు సతమతమవుతున్నారు. ఇళ్లలోనూ కుదురుగా ఉండలేని పరిిస్థితి. చల్లదనం కోసం కూలర్లు, ఏసీలు, ఫ్యాన్లపై ఆధారపడటంతో విద్యుత్‌ మీటర్లు గిర్రున తిరుగుతున్నాయి. దీంతో చాలామంది గృహజ్యోతి పథకానికి దూరమయ్యారు. రెండు నెలల్లోనే జీరో బిల్లు లబ్ధిదారుల సంఖ్య వేలల్లో తగ్గిపోయారు. ఇక మేలో వీరి సంఖ్య మరింత పెరిగే అవకాశం లేకపోలేదు.

200 యూనిట్లు దాటితే..

రాష్ట్ర ప్రభుత్వం దారిద్య్ర రేఖకు దిగువ ఉన్న విద్యుత్‌ వినియోగదారులకు గృహజ్యోతి పథకాన్ని వర్తింపజేస్తోంది. గృహ అవసరాలకు 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్‌ అందిస్తోంది. ఆ పరిధిలోపు కరెంట్‌ వాడితే బిల్లు కట్టాల్సి ఉండదు. నెలలో 200 యూనిట్లకు మించి ఒక యూనిట్‌ అదనంగా వినియోగించినా పూర్తిస్థాయిలో బిల్లు చెల్లించాల్సిందే. ప్రస్తుతం ఎండల తీవ్రతను తట్టుకోలేక ఇళ్లలో విద్యుత్‌ వినియోగం గణనీయంగా పెరుగుతోంది. ఉక్కపోతకు కూలర్లు, ఏసీలు, ఫ్యాన్లను అధికంగా వాడుతుండటంతో 200 యూనిట్ల పరిధి దాటుతోంది. గృహజ్యోతి వినియోగదారులు జీరో బిల్లుకు దూరమవుతున్నారు. జిల్లాలోని 15 మండలాల పరిధిలో మొదటి కేటగిరీ విద్యుత్‌ కనెక్షన్లు 1.19 లక్షలు ఉన్నాయి. మార్చిలో గృహజ్యోతి లబ్ధిదారుల సంఖ్య 81,253 ఉండగా 200 యూనిట్లలోపు విద్యుత్‌ వినియోగించిన 80,025 మంది జీరో బిల్లు పొందారు. ఏప్రిల్‌ రెండో వారం నుంచి ఎండలకు విద్యుత్‌ వాడకం పెరిగి 3080 మంది జీరో బిల్లుకు దూరయ్యారు. ఏప్రిల్‌లో గృహజ్యోతి లబ్ధిదారులు 81,812 మంది ఉండగా 200 యూనిట్లలోపు విద్యుత్‌ వినియోగించిన లబ్ధిదారుల సంఖ్య 76,945కు పడిపోయింది. మార్చితో పోల్చితే ఏప్రిల్‌లో 3,080 మంది లబ్ధిదారులు గృహజ్యోతి సబ్సిడీకి దూరమయ్యారు. మే మొదటి వారంలోనే జిల్లాలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలను దాటాయి. ప్రస్తుతం రెండు, మూడు రోజులుగా ఈదురుగాలులు, అకాల వర్షాలతో వాతావరణం చల్లబడింది. విద్యుత్‌ కోతలు సైతం విధించడంతో కూలర్లు, ఫ్యాన్ల వాడకం తగ్గింది. అయితే మళ్లీ ఎండలు పెరిగితే కరెంట్‌ వాడకం గరిష్ట స్థాయికి చేరే అవకాశం ఉంది. మే నెలలోనూ గృహజ్యోతి లబ్ధిదారుల సంఖ్య మరింత తగ్గిపోయే అవకాశం ఉందని విద్యుత్‌శాఖ అధికారులు భావిస్తున్నారు.

పొదుపు చేస్తేనే ఫలితం

Advertisement
 
Advertisement
Advertisement