
విధుల డుమ్మాకు చెక్
● వైద్య సిబ్బందిపై ప్రత్యేక నిఘా ● ప్రభుత్వాస్పత్రుల్లో అబాస్ హాజరు ● త్వరలో ప్రారంభించనున్న సర్కార్ ● వివరాలు సేకరించిన వైద్యారోగ్యశాఖ
కెరమెరి(ఆసిఫాబాద్): జిల్లాలోని వైద్యారోగ్యశాఖ సిబ్బంది ఇక నుంచి నిక్కచ్చిగా విధులు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తోంది. సిబ్బంది విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదనే ఆరోపణల నేపథ్యంలోనే ముఖ గుర్తింపు హాజరు నమోదుకు నిర్ణయించింది. ఇప్పటికే ఆయా మండలాల్లోని వైద్య సిబ్బంది వివరాలను జిల్లా స్థాయి అధికారులు సేకరించి వైద్యారోగ్య శాఖకు పంపించారు. త్వరలో అబాస్ (ఆధార్ బేస్డ్ అటెండెన్స్ సిస్టం) హాజరు అమలులోకి రానుంది.
మెరుగైన సేవలందించేందుకే..
అధికారులు, సిబ్బంది విధులకు హాజరై మధ్యలో ఇంటికెళ్లడం, ఇదేమిటని? ప్రశ్నిస్తే క్షేత్రస్థాయిలో విధులకు వెళ్లానని చెప్పడం, విధులకు రాకపోయినా వచ్చినట్లు సంతకాలు చేయడం లాంటి ఘటనలు జిల్లా పలుచోట్ల జరుగుతున్నాయి. దీంతో ప్రజలు ఫిర్యాదు చేయగా వారి కి మెరుగైన వైద్యసేవలందడం లేదని వైద్యారోగ్యశాఖ గుర్తించింది. ఇలా వ్యవహరించే ఉ ద్యోగులపై ప్రత్యేక నిఘా పెట్టాలని నిర్ణయించింది. జిల్లా వ్యాప్తంగా ఆస్పత్రులు, కార్యాలయాల్లో పనిచేసే వారి వివరాలు సేకరించింది. గతంలో కొన్ని పీహెచ్సీల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి జిల్లా కేంద్రంలోని వైద్యారోగ్యశాఖ కార్యాలయానికి అనుసంధానం చేశారు. ప్రస్తుతం అవి సక్రమంగా పనిచేయడం లేదు.
ఇప్పటికే వివరాల సేకరణ
జిల్లాలోని 15 మండలాల్లో 15 పీహెచ్సీలు, ఆ రు సీహెచ్సీలున్నాయి. వీటి పరిధిలో సుమారు 315 మంది సిబ్బంది పని చేస్తున్నారు. కింది స్థాయి సిబ్బంది నుంచి జిల్లాస్థాయి అధికారుల వరకు ఒకే తరహాలో హాజరు విధానాన్ని అమలు చేయనున్నారు. వైద్యసేవలను మెరుగుపర్చేందుకు విధులకు డుమ్మా కొట్టే సిబ్బందిని గాడిలోకి తెచ్చేందుకు ఈ అబాస్ హాజరు విధా నం ఉపయోగపడనుంది. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం సిబ్బంది ఆధార్కార్డు వివరాల సేకరణ కొద్దిరోజుల నుంచి కొ నసాగుతోంది. ఇది పూర్తి కాగానే కొత్త యాప్ అందుబాటులోకి రానుంది. దీని ద్వారా అధికా రులతో పాటు సిబ్బంది హాజరు నమోదు కానుంది. ఒక్కో ఉద్యోగికి ఒక్కో ఐడీ కేటాయిస్తారు. ఐడీలను అబాస్ మిషన్లో నమోదు చేస్తారు. విధులకు వెళ్లిన తర్వాత, ఉన్న స్థానం నుంచి హాజరు నమోదు చేయాల్సి ఉంటుంది.
వివరాలు పంపించాం
జిల్లాలోని వివిధ ప్రభుత్వ ఆస్పత్రులు, జిల్లా కేంద్రంలోని కార్యాలయ సిబ్బంది వివరాలు సేకరించి ఉన్నతాధికారులకు పంపించాం. ఇప్పటివరకు అబాస్ హాజరు అమలుపై ఆదేశాల రాలేదు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే కొత్త హాజరు విధానం అమలయ్యేలా చర్యలు తీసుకుంటాం.
– సీతారాం, డీఎంహెచ్వో

విధుల డుమ్మాకు చెక్