ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం లోక్సభ సభ్యుడిగా రామసహాయం రఘురాంరెడ్డి పదవీకాలం గురువారంతో రెండేళ్లు పూర్తవుతోంది. గడిచిన 24నెలల కాలంలో జరిగిన ఏడు పార్లమెంట్ సమావేశాల్లోనూ పాల్గొన్న ఎంపీ రికార్డు స్థాయిలో 78.5 శాతం హాజరు నమోదు చేసుకున్నారు. అంతేకాక నియోజకవర్గానికి సంబంధించి 130 ప్రశ్నలను సభ దృష్టికి తీసుకెళ్లారు. పాల్వంచ థర్మల్ పవర్ స్టేషన్ పునరుద్ధరణకు ఆర్థిక సాయం, పోలవరం ముంపు బాధితులకు న్యాయం, ఉభయ జిల్లాల్లో మిర్చి రైతుల సమస్యలే కాక చారిత్రక నేలకొండపల్లి బౌద్ధ క్షేత్రాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలనే తదితర అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఇక ఎంపీ లాడ్స్ కింద రూ.9.42 కోట్లు, ఉపాధి హామీ పథకం ద్వారా రూ.18 కోట్లు, ఎస్డీఎఫ్ కింద రూ.4 కోట్ల నిధులను నియోజకవర్గంలో సీసీ రోడ్లు, అంగన్వాడీ కేంద్రాల నిర్మాణం, చేతిపంపుల ఏర్పాటు తదితర 176 పనులను మంజూరు చేశారు. అలాగే, ఖానా పురం వద్ద రూ.3.47 కోట్లతో కొత్త వంతెన నిర్మాణానికి చొరవ చూపారు. పేదలకు వైద్య సాయం అందేలా సీఎంఆర్ఎఫ్ద్వారా 1,864 మందికి రూ. 5,65,81,500 విలువైన సాయం మంజూరు చేయించారు. ఇక అత్యవసర చికిత్సల కోసం 41 మందికి రూ.79.80లక్షల ఎల్ఓసీలను కేటాయించారు.
పలు అంశాలు పార్లమెంట్లో
ప్రస్తావించిన రఘురాంరెడ్డి


