● లక్ష్యం మేర రుణాల పంపిణీ జరగాలి ● వార్షిక రుణ ప్రణాళిక విడుదల చేసిన అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి
ఖమ్మంగాంధీచౌక్: బ్యాంకు రుణాల పంపిణీ లబ్ధిదారుల ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి అన్నారు. కలెక్టరేట్లో బుధవారం నిర్వహించిన జిల్లా సంప్రదింపుల కమిటీ(డీసీసీ), జిల్లా స్థాయి సమీక్ష కమిటీ(డీఎల్ఆర్సీ) సమావేశంలో ఆయన 2026–27 సంవత్సరం వార్షిక రుణ ప్రణాళిక విడుదల చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ 2025–26లో నిర్దేశించుకున్న రూ.11,635.78 కోట్ల లక్ష్యానికి గాను రూ.12,551.44 కోట్లు అందించడం(107.87 శాతం)పై బ్యాంకర్లను అభినందించారు. వ్యవసాయ రుణాల పంపిణీలో బ్యాంకులు ముందంజలో ఉన్నాయని, ఈ రంగంలో రూ.8,378.18 కోట్లకు గాను రూ.9,841.64 కోట్లు అందించి 117.47 శాతంగా నమోదు చేశారని తెలి పారు. ఇక వ్యవసాయ టర్మ్ లోన్ల పంపిణీలో 134.82 శాతం, గృహ రుణాల్లో 238శాతం, ఎంఎస్ఎంఈ రంగంలో 77.25 శాతం నమోదైందన్నారు. అయితే, విద్యారుణాల విషయంలో రూ.96.98 కోట్ల లక్ష్యానికి రూ.28 కోట్లే పంపిణీ చేయడంపై కారణాలు ఆరా తీశారు. విద్యార్థులకు విస్తృత అవగాహన కల్పించి ఈ ఆర్థిక సంవత్సరంలో లక్ష్యాలను చేరాలని సూచించారు. ఆతర్వాత ముద్ర, ప్రధానమంత్రి ఉపాధి కల్పన, ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార పరిశ్రమల అభివృద్ధి పథకం, విశ్వకర్మ పథకం, స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాలపై సమీక్షించారు. అలాగే, 1,036 సంఘాలకు సంబంధించిన రూ.25.56 కోట్ల ఎన్పీఏలు ఆరు నెలలకు పైగా పెండింగ్ ఉన్నందున ప్రత్యేక దృష్టి సారించాలని బ్యాంకర్లకు అదనపు కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో ఆర్బీఐ లీడ్ డిస్టిక్ర్ట్ ఆఫీసర్ యశ్వంత్ సాయి, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ప్రవీణ్, ఎస్సీ, గిరిజన అభివృద్ధి శాఖల అధికారులు మహమ్మద్ ముజాహిద్, విజయలక్ష్మి, ఖమ్మం ఎల్డీఎం రవిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


