పెనుబల్లి/సత్తుపల్లిటౌన్: గ్రామంలో వ్యభిచార గృహం నిర్వహించొద్దని సూచించిన ఇద్దరిపై నిర్వాహకులు కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటన సత్తుపల్లి మండలం కిష్టారం శివారులో ఆదివారం రాత్రి జరిగింది. ఏపీలోని తిరువూరు మండలానికి చెందిన దంపతులు సత్తుపల్లి మండలం కిష్టారం సమీపాన ఉంటూ వ్యభిచార గృహం నిర్వహిస్తున్నట్లు తెలిసింది. తద్వారా గ్రామానికి చెడ్డపేరు వస్తోందని కిష్టారం ఎస్సీకాలనీకి చెందిన కొందరు శనివారం నిర్వాహకులతో మాట్లాడి వ్యభిచార గృహాన్ని మూసివేసి ఇతర పనిచేసుకోవాలని, లేకపోతే గ్రామస్తుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు. మళ్లీ ఆదివారం రాత్రి మారోజు నాగేశ్వరరావు, నక్కా వెంకటేశ్వరరావు వెళ్లేసరికి సదరు దంపతుల తీరు మారకపోవడంతో ప్రశ్నిస్తుండగా తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో దంపతులు కొబ్బరిబొండాలు నరికే కత్తులతో నాగేశ్వరరావు, వెంకటేశ్వరరావుపై దాడి చేయగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు 108లో వారిని సత్తుపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే, ఘటన జరిగిన వెంటనే నిందితులైన దంపతులు పరారు కాగా, వ్యభిచార గృహంలో ఉన్న కొత్తగూడెంకు చెందిన యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై సత్తుపల్లి ఎస్ఐ వీరప్రసాద్ కేసు నమోదు చేయగా, చికిత్స పొందుతున్న నాగేశ్వరరావును కాంగ్రెస్ నాయకుడు మట్టా దయానంద్ తదితరులు సోమవారం పరామర్శించారు.
ఇద్దరికి తీవ్ర గాయాలు


