వేంసూరు: మండలంలోని కుంచపర్తి గ్రామంలోని శివాలయం ప్రాంగణంలో నాలుగు రోజులుగా జరుగుతున్న తవ్వకాలు కలకలం రేపాయి. గ్రామంలోని బాలాజీ త్రిపుర సుందరి సమేత సుందరేశ్వర స్వామి దేవాలయం వెనకాల తవ్వకాలు చేపట్టడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆదివారం తెల్లవారుజామున పోలీసులు ఆలయ ప్రాంగణంలో తనిఖీ చేపట్టి తవ్వకాలు జరుపుతున్న 11 మంది కూలీలను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీసులు విచారించగా ఆలయంలో గత 18 ఏళ్లుగా పూజారిగా పనిచేస్తున్న భరద్వాజానంద ఆధ్వర్యాన తవ్వకాలు జరిగాయని తేలినట్లు సమాచారం. గ్రామ శ్రేయస్సు కోసం 18 అడుగుల గొయ్యి తీయించి శ్రీచక్రం, కొన్ని యంత్రాలను ప్రతిష్ఠించేందుకు తవ్వకాలు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. పగలు మాత్రమే తవ్వకాలు చేపట్టామని, పనిచేసిన కూలీలు రాత్రి ఇక్కడే నిద్రిస్తున్నారని తెలిపారు. అయితే, గ్రామస్తులు మాత్రం బయటి నుంచి కూలీలను రప్పించి, స్థానికులకు సమాచారం ఇవ్వకుండా అర్ధరాత్రి వేళ తవ్వకాలు చేయిస్తున్నారని ఆరోపించారు. గుప్త నిధుల అన్వేషణ కోసమే తవ్వకాలు చేపడుతున్నారనే అనుమానాలు ఉన్నందున పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేపట్టాలని కోరారు.
తలోమాట చెబుతున్న పూజారి, గ్రామస్తులు


