ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మంకు చెందిన నిరుపేద కుటుంబానికి సొంతిల్లు లేదని తెలుసుకున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సూచనలతో 24 గంటల్లోగా డబుల్ బెడ్రూమ్ ఇంటిని కేటాయించామని కలెక్టర్ దివాకర టీ.ఎస్. ఒక ప్రకటనలో తెలిపారు. ఖమ్మంకు చెందిన తురక దేవీప్రసన్న ఏఎస్ఆర్ ప్రభుత్వ కాలేజీలో ఇంటర్ బైపీసీ చదువుతూ ప్రథమ సంవత్సరంలో 434 మార్కులు సాధించడమే కాక జాతీయస్థాయి రెడ్ రిబ్బన్ క్విజ్ పోటీల్లో ప్రథమస్థానాన నిలిచింది. దీంతో హైదరాబాద్లో శుక్రవారం గవర్నర్ శివప్రతాప్ శుక్లా సమక్షంలో సీఎం ఆమెకు రూ.50వేల నగదు, జ్ఞాపిక అందజేశారు. ఈక్రమాన కుటుంబ పరిస్థితిపై ఆరా తీయగా తండ్రి లేడని, తల్లి జ్యోతి కష్టాలు పడి చదివిస్తుండగా ఇల్లు లేదని వెల్లడించింది. దీంతో డబుల్ బెడ్రూం ఇల్లు కేటాయించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కలెక్టర్ దివాకర టీ.ఎస్.ను సీఎం ఆదేశించారు. ఈమేరకు ఖమ్మం వైఎస్ఆర్.నగర్లో డబుల్ బెడ్రూమ్ సముదాయంలోని ఇంటిని కేటాయిస్తూ ఖమ్మం అర్బన్ తహసీల్దార్ జయచందర్ శనివారం దేవీప్రసన్న కుటుంబానికి శనివారం పత్రాలు అందజేశారని కలెక్టర్ తెలిపారు. సమస్యకు సత్వర పరిష్కారం చూపిన సీఎం రేవంత్రెడ్డి, మంత్రి తుమ్మలతో పాటు యంత్రాంగానికి దేవీప్రసన్న కుటుంబీకులు కృతజ్ఞతలు తెలిపారు.
కలెక్టర్ దివాకర టీ.ఎస్.


