1,650 సైలెన్సర్లు ధ్వంసం | - | Sakshi
Sakshi News home page

1,650 సైలెన్సర్లు ధ్వంసం

Jun 20 2026 12:07 AM | Updated on Jun 20 2026 12:07 AM

ఖమ్మంక్రైం: రూ.లక్షలు వెచ్చించి బుల్లెట్‌ వాహనాలు కొనుగోలు చేస్తున్న కొందరు యువకులు, కంపెనీతో వచ్చిన సైలెన్సర్‌ తొలగించి పెద్ద శబ్దాలు వచ్చేవి అమరుస్తున్నారు. ఆపై రహదారులపై తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారనే సమాచారంతో ట్రాఫిక్‌ పోలీసులు కొద్దిరోజులుగా తనిఖీ చేపట్టి అలాంటి సైలెన్సర్లను తొలగించారు. ఇలా తొలగించిన 1,650 సెలెన్సర్లను సీపీ సునీల్‌దత్‌ ఆదేశాలతో శుక్రవారం హెడ్‌క్వార్టర్స్‌లో రోడ్డు రోలర్‌తో తొక్కించి ధ్వంసం చేయించారు. ఇలాంటి సెలెన్సర్ల శబ్దాలతో వృద్ధులు, గుండె జబ్బులు ఉన్నవారు ఇబ్బంది పడుతున్నందున తనిఖీలు నిరంతరం కొనసాగిస్తామని ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు.

ప్రైవేట్‌ ల్యాబ్‌ల్లో తనిఖీ

వైరా: ౖవెరాలోని పలు ప్రైవేట్‌ ల్యాబ్‌లను శుక్రవారం డీఎంహెచ్‌ఓ రామారావు ఆధ్వర్యంలో తనిఖీ చేశారు. నిబంధనలకు అనుగుణంగా పరీక్షలు నిర్వహిచాలని, ధరల పట్టిక ప్రదర్శించాలని నిర్వాహకులకు సూచించారు. అలాగే, అర్హత కలిగిన సిబ్బందినే నియమించుకోవా లని తెలిపారు. ప్రతీ ల్యాబ్‌ నిర్వహణకు అను మతి లేకపోతే సీజ్‌ చేస్తామని వెల్లడించారు. తనిఖీల్లో మెడికల్‌ ఆఫీసర్‌ శ్రీహర్ష, ఉద్యోగులు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

30లోగా జాబితాలు

అందజేయాలి

ఖమ్మంస్పోర్ట్స్‌: ఉమ్మడి జిల్లా హ్యాండ్‌బాల్‌ అసోసియేషన్‌ ఎన్నికలు త్వరలో నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారి జి.బాలసైదులు తెలిపారు. ఈ మేరకు మండలస్థాయిలో క్లబ్‌ల నిర్వాహకులు ఈ నెల 30వ తేదీలోగా జాబితాలు అందజేయాలని సూచించారు. తద్వారా వారు ఎన్నికల్లో పాల్గొనే అవకాశం ఉంటుందని తెలిపారు.

సదరమ్‌ పేరిట మోసం

ఖమ్మంక్రైం: మానసిక దివ్యాంగుడికి సదరమ్‌ సర్టిఫికెట్‌ ఇప్పిస్తానని ఖమ్మం జనరల్‌ ఆస్పత్రి సెక్యూరిటీ గార్డు డబ్బు తీసుకుని మోసం చేయగా, శుక్రవారం కేసు నమోదు చేసినట్లు ఖమ్మం టూటౌన్‌ సీఐ బాలకృష్ణ తెలిపారు. మానసిక దివ్యాంగుడైన సాయికుమార్‌ చారికి ఇటీవల సదరం క్యాంప్‌ వద్ద సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న నరసింహారావు పరిచయయ్యాడు. సదరం సర్టిఫికెట్‌ ఇప్పిస్తానని రూ.20 వేలు అడగగా చారి తొలుత రూ.7 వేలు చెల్లించాడు. మిగతా డబ్బులు కూడా ఇవ్వాలని వేధిస్తుండడంతో సాయికుమార్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ నరేందర్‌కు, ఆయన సూచనలతో పోలీసులకు ఫిర్యాదు చేయగా నరసింహారావుపై కేసు నమోదు చేశారు.

28 టన్నుల

రేషన్‌ బియ్యం పట్టివేత

బూర్గంపాడు: ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఛత్తీస్‌గఢ్‌కు అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని శుక్రవారం ఉదయం బూర్గంపాడులో పోలీసులు పట్టుకున్నా రు. ఎస్‌ఐ ప్రసాద్‌ వివరాలు వెల్లడించారు. ఏపీ లోని జగ్గయ్యపేట నుంచి ఛత్తీస్‌గఢ్‌కు తరలిస్తున్న రేషన్‌ బియ్యం లారీని బూర్గంపాడు మార్కెట్‌యార్డు వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు పట్టుకున్నారు. లారీలో 28 టన్నుల రేషన్‌ బియ్యం ఉండటంతో సీజ్‌ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తరలిస్తున్న మల్కన్‌గిరికి చెందిన లారీ ఓనర్‌ నవీన్‌కుమార్‌ బాత్ర, లారీడ్రైవర్‌ బికాస్‌ ఆచార్యను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. బియ్యం సరఫరా చేసిన శ్రీరంగం సత్యనారాయణపై కూడా కేసు నమోదు చేశామని, అతను ప్రస్తుతం పరారీలో ఉన్నాడని ఎస్‌ఐ ప్రసాద్‌ వివరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement