పాల్వంచ: యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్లోని ఏహెచ్పీ, సీహెచ్పీ విభాగాలను ప్రైవేటీకరించాలన్న ప్రతిపాదనలను విరమించుకోవాలని తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పాల్వంచ కేటీపీఎస్లోని 5, 6, 7వ దశల్లో వేర్వేరుగా శుక్రవారం భోజన విరామ సమయాన నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. కార్యక్రమాల్లో నాయకులు మాట్లాడుతూ వైటీపీఎస్ ప్లాంట్లో రూ.255 కోట్లకు టెండర్లు పిలవడం వల్ల జెన్కో ఉద్యోగుల మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పారు. ఇకనైనా ప్రైవేటీకరణ యత్నాలు విరమించుకుని, టెండర్లు నిలిపివేయకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు ఉమామహేశ్వరరావు, యాస్మిన్, భాగ్యరాజ్, శ్రీనివాసరావు, శ్రీపాల్, ప్రభాకర్, బ్రహ్మాజీ, మహేశ్, రఘువీర్, రాధాకృష్ణ, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.


