ఖమ్మంసహకారనగర్: నిరాశ్రయులు, అనాథలు, మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆశ్రయం కల్పిస్తున్న ఖమ్మంలోని అన్నం సేవా ఫౌండేషన్లో గురువారం ప్రత్యేక ఆధార్ నమోదు శిబిరం నిర్వహించారు. జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి పి.దేవీమానస ఇటీవల ఫౌండేషన్ను పరిశీలించిన సందర్భంగా ఆశ్రయం పొందుతున్న పలువురికి గుర్తింపు పత్రాలు లేకపోవడం వల్ల సంక్షేమ సేవలు, ఇతర ప్రయోజనాలు అందడం లేదని గుర్తించారు. అంతేకాక మానసిక స్థితి సరిగ్గా లేని వారి గుర్తింపు కష్టమవుతోందని భావించారు. ఈమేరకు జిల్లా యంత్రాంగం సహకారంతో ప్రత్యేక ఆధార్ శిబిరం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి పి.దేవీమానస మాట్లాడుతూ గుర్తింపు పత్రం అనేది సంక్షేమ సేవలు, న్యాయ పరిరక్షణలో కీలకంగా నిలుస్తుందని తెలిపారు. ఆధార్ నమోదు పూర్తయ్యాక సేవలు, సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ అన్నం శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.


