కారేపల్లి: సరైన వర్షపాతం నమోదు కాకముందే రైతులు తొందరపడి పత్తి విత్తనాలు నాటి నష్టపోవద్దని జిల్లా వ్యవసాయ అధికారి ధనసరి పుల్లయ్య సూచించారు. కారేపల్లి మండలంలో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యూరియా సేల్ పాయింట్లను బుధవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విత్తన ప్యాకెట్లు, రిజిస్టర్లు, వ్యాపారుల లైసెన్సులను పరిశీలించి సూచనలు చేశారు. అనంతరం కారేపల్లి సొసైటీలో రైతులతో సమావేశమైన డీఏఓ మాట్లాడుతూ.. వర్షాభావ పరిస్థితుల నేపథ్యాన ప్రత్యామ్నాయ పంటలు ఎంచుకోవాలని తెలిపారు. అంతేకాక నానో యూరియా, నానో డీఏపీ వినియోగిస్తే మంచిదని చెప్పారు. అలాగే, యాప్ ద్వారానే యూరియా బుక్ చేసుకోవాలని తెలిపారు. కాగా, పత్తి విత్తనాలు నాటడానికి వచ్చే 15వ తేదీ వరకు సమయం ఉన్నందున తొందరపడొద్దని సూచించారు. కార్యక్రమంలో వైరా ఏడీఓ తుమ్మలపల్లి కరుణశ్రీ, ఏఓ అనిల్, ఏఈఓలు నరేశ్, మహేశ్, మున్నీ, సొసైటీ కార్యదర్శి బొల్లు హన్మంతరావు, ఆత్మ కమిటీ డైరెక్టర్ భూక్యా పద్మ తదితరులు పాల్గొన్నారు.


