బోనకల్: రైలుకింద పడి గుర్తు తెలియని వ్యక్తి (30) మృతిచెందాడు. బోనకల్ – మోటమర్రి రైల్వేస్టేషన్ల మధ్య బుధవారం సదరు వ్యక్తి రైలు నుంచి జారిపడడంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో పోస్ట్మార్టం నిమిత్తం మధిర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు తెలిపారు.
కుళ్లిపోయిన స్థితిలో పూజారి మృతదేహం
నెల క్రితం అదృశ్యమైన పోలంపల్లి వాసి
కారేపల్లి: నెల రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన వ్యక్తి.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవి పల్లి మండలం గట్టుమల్ల అటవీ ప్రాంతంలో బుధవారం మృతదేహంగా కనిపించాడు. కారేపల్లి మండలం పోలంపల్లికి చెందిన మూతి వీరభద్రం (45) వీరభద్రస్వామి ఆలయంలో పూజారిగా కొనసాగుతున్నాడు. నెల క్రితం ఇంటి నుంచి వెళ్లిన ఆయన తిరిగి రాకపోవడంతో కుటుంబీకులు ఆరా తీస్తున్నారు. ఇంతలోనే గట్టుమల్ల అటవీప్రాంతంలో కుళ్లిపోయిన స్థితిలో వీరభద్రం మృతదేహం కనిపించింది. ఘటనా స్థలంలో లభించిన ఆధార్ కార్డు, సెల్ఫోన్ ఆధారంగా మృతుడిని గుర్తించిన అక్కడి పోలీసులు కుటుంబీకులతో పాటు సర్పంచ్కు సమాచారం అందించారు. అవివాహితుడైన వీరభద్రం మృతిపై అనుమానాలు వ్యక్తమవుతుండగా, ఆయన ఎలా మృతి చెందాడనేది గుర్తించేందుకు విచారణ చేపడుతున్నటుపోలీసులు తెలిపారు.
వడదెబ్బతో వ్యక్తి మృతి
నేలకొండపల్లి: మండలంలోని చెన్నారం గ్రామంలో వడదెబ్బకు గురై బుధవారం వ్యక్తి మృతి చెందాడు. గ్రామానికి చెందిన నాగయ్య (40) ఎండ తీవ్రత తట్టుకోలేక అస్వస్థతకు గురై మృతిచెందాడు.
బైక్ అదుపుతప్పడంతో ఒకరు..
మధిర: మధిరలోని ట్యాంక్బండ్పై బుధవారం జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమీప బంధువులైన అంబారుపేటకు చెందిన జక్కంపూడి ఉపేందర్ (38), వినుకొండ గోపి మధిర నుంచి ద్విచక్ర వాహనంపై అంబారుపేట వైపు వెళ్తున్నారు. ఈక్రమాన వీరి బైక్ ట్యాంక్బండ్పై అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఘటనలో తీవ్రగాయాలతో ఉపేందర్ అక్కడికక్కడే మృతి చెందాడు. చేపల వ్యాపారం చేసే ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా, తీవ్ర గాయాలైన గోపిని ఖమ్మం తరలించారు. మధిర టౌన్ పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు.


