కూసుమంచి: మత్స్యకారులు, మత్స్య రైతులు ఆధునిక పద్ధతుల్లో చేపల పెంపకం చేపట్టడం ద్వారా అధిక ఉత్పత్తి సాధ్యమవుతుందని నాబార్డు డీడీఎం సుజిత్కుమార్ తెలిపారు. పాలేరులోని మత్స్య పరిశోధనా కేంద్రంలో ‘బయోప్లాక్ విధానంలో చేపల పెంపకం’అంశంపై ఇస్తున్న శిక్షణ బుధవారం ముగిసింది. ఈ సందర్భంగా హాజరైన మత్స్య రైతులకు సర్టిఫికెట్లు అందజేశాక డీడీఎం మాట్లాడుతూ.. డిమాండ్కు తగ్గట్టు చేపల ఉత్పత్తి జరగాలంటే నూతన విధానాలు ఎంచుకోవాలని సూచించారు. ఇందుకోసం శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అలాగే, మత్స్యకారుల కోసం నాబార్డు అందిస్తున్న పథకాలను వివరించారు. కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్యాంప్రసాద్, శాస్త్రవేత్తలు శాంతన్న, రవీందర్, దివ్య, చొప్పరి రాంచంద్రం, అనిల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చిన్నమండవలో పేలుడు పదార్థాలు స్వాధీనం
చింతకాని: మండలంలోని చిన్నమండవ సమీపాన నిషేధిత పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మార్గంలో కొందరు పేలుడు పదార్థాలు తరలిస్తున్నారనే సమాచారంతో పోలీసులు తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా కొణిజర్ల మండలం గుబ్బగుర్తికి చెందిన ఆళ్లకుంట నరసింహారావు, తిరుమలాయపురం మండలం బీరోలుకు చెందిన వల్లపు లక్ష్మణ్ పట్టుబడగా వారి నుంచి 67 జిలిటెన్ స్టిక్లు, ఆరు ఎలక్ట్రికల్ డిటోనేటర్లు స్వాధీనం చేసుకున్నారు. వీరిని అదుపులోకి తీసుకునిట్రాక్టర్ మిషన్ యజమాని కంది మల్లయ్యపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నరేశ్ తెలిపారు.


