● వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలి ● కలెక్టర్ దివాకర టీ.ఎస్.
వైరా: ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ నమ్మకంతో వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. సూచించారు. వైరాలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని మంగళవారం తనిఖీ చేసిన ఆయన క్యాజువాలిటీ, లేబర్ రూమ్, ఎమర్జెన్సీ వార్డు, ఓపీ రూమ్, ల్యాబ్లను పరిశీలించడంతో పాటు చికిత్స కోసం వచ్చిన వారితో మాట్లాడి వివరాలు ఆరా తీశారు. అలాగే, మందుల నిల్వలు, వైద్యుల హాజరును పరిశీలించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆస్పత్రిలో పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టడమే కాక మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలిపారు. ఆతర్వాత 100 పడకల ఏరియా అస్పత్రి నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. డీసీహెచ్ఎస్ డాక్టర్ రాజశేఖరగౌడ్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
సౌకర్యాల కల్పనలో రాజీ పడొద్దు
కారేపల్లి: మండలంలోని విశ్వనాథపల్లి జెడ్పీహెచ్ఎస్ను కలెక్టర్ దివాకర మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు సమకూర్చడమేకాక బోధన, అల్పాహారం, మధ్యాహ్న భోజన అమలులో రాజీ పడొద్దని ఉపాధ్యాయులకు సూచించారు. తహసీల్దార్ ఓరుగంటి వెంకటేశ్వర్లు, ఇన్చార్జి ఎంపీడీఓ మల్లెల రవీంద్రప్రసాద్, ఎంఈఓ దుగ్గిరాల జయరాజు, సర్పంచ్ ఇస్లావత్ రాజు, ఉపాధ్యాయుడు రాంకోటి పాల్గొన్నారు.


