ఖమ్మంక్రైం: మారుతున్న పరిస్థితులు, కొత్త సవాళ్లకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలతో పోలీసింగ్పై దృష్టి సారించాలని పోలీసు కమిషనర్ సునీల్దత్ సూచించారు. ఖమ్మం రూరల్ డివిజన్ పోలీస్ అధికారులతో మంగళవారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ స్టేషన్ హౌస్ ఆఫీసర్ క్షేత్రస్థాయిలో పర్యటించాలని, తద్వారా నేరాల కట్టడి సాధ్యమవుతుందని తెలిపారు. అంతేకాక యువత భవిష్యత్ను నాశనం చేస్తున్న గంజాయి, ఇతర మత్తుపదార్థాల రవాణా, అమ్మకాలతో పాటు సైబర్ నేరాలను అడ్డుకునేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. విద్యాసంస్థల్లో విస్తృత అవగాహన కల్పించడం ద్వారా ఇది సాధ్యమవుతుందని తెలిపారు. కాగా, రైతులు నకిలీ విత్తనాల బారినపడి నష్టపోకుండా వ్యవసాయ, రెవెన్యూ శాఖలతో సంయుక్తంగా తనిఖీలు ముమ్మరం చేయాలని చెప్పారు. అంతేకాక ఏపీ నుంచి ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవడంతో పాటు రోడ్డు ప్రమాదాల కట్టడిపై దృష్టి సారించాలని సీపీ తెలిపారు. ఈసమావేశంలో అడిషనల్ డీసీపీ రామానుజం, ఏపీపీ తిరుపతిరెడ్డి, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.
పోలీసు కమిషనర్ సునీల్దత్


