నేడు జిల్లాకు డిప్యూటీ సీఎం రాక
మధిర: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బుధవారం మధిర రానున్నారు. ఈ సందర్భంగా మధిరలోని క్యాంపు కార్యాలయంలో జరిగే భోగి సంబురాల్లో భట్టి విక్రమార్క పాల్గొంటారు. అలాగే, గురువారం కూడా సంక్రాంతి వేడుకల్లో పాల్గొననున్న భట్టి విక్రమార్క, శుక్రవారం సైతం పలు కార్యక్రమాలకు హాజరవుతారు.
ఆరు జిల్లాల స్థాయి
కబడ్డీ పోటీలు
కొణిజర్ల: కొణిజర్ల మండలం ఉప్పలచలకలో ఆరు జిల్లాల స్థాయి కబడ్డీ పోటీలు మంగళవా రం ప్రారంభమయ్యాయి. గ్రామసర్పంచ్ గుగులోతు చందు శారద నేతృత్వాన ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, నల్లగొండ, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల స్థాయి పోటీలు నిర్వహిస్తున్నారు. ఈపోటీలను బీఆర్ఎస్ నాయకులు చిరుమామిళ్ల రవికిరణ్, లకా వత్ గిరిబాబు ప్రారంభించి మాట్లాడారు. నాయకులు పోట్ల శ్రీను, దేవుళ్ల వీరన్న, బానోత్ రవీందర్, భూక్యా మాన్సింగ్, తులిసింగ్, కృష్ణమూర్తి, ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.
కళాకారులకు
పుట్టినిల్లు కొమరారం
మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు
ఇల్లెందురూరల్: కళాకారులకు కొమరారం పుట్టినిల్లు వంటిదని, అలాంటి గ్రామంలో జన్మించి, తన పూర్వీకుల ఆనవాయితీని పుణికిపుచ్చుకున్న సాయిలు సినీ దర్శకుడిగా ఎదగడం హర్షణీయమని సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, ప్రజాకవి జయరాజు అన్నారు. కొమరారంలో రాజు వెడ్స్ రాంబాబు చిత్ర దర్శకుడు కాంపాటి సాయిలు అభినందన సభ మంగళారం రాత్రి నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. కళలపై అభిమానంతో చిరుప్రాయం నుంచే ఆసక్తి చూపిన సాయిలు తనకంటూ ఒక గుర్తింపు కోసం హైదరాబాద్లో మకాం వేసి నిరంతర సాధన, కఠోర శ్రమతో నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకున్నారని, ఈ ప్రయాణంలో మరింత ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, చండ్ర అరుణ, నాయిని రాజు, ఆజ్మీర బిచ్చా, కాంపాటి పృథ్వీ తదితరులు పాల్గొన్నారు.
గిరిజన సంస్కృతికి
అద్దం పడుతోంది
భద్రాచలంటౌన్ : భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన మ్యూజియం గిరిజనుల జీవనశైలి, ఆచార వ్యవహారాలకు అద్దం పడుతోందని ఆస్ట్రేలియా పర్యాటకురాలు రాబిన్ జెపరి ప్రశంసించారు. హైదరాబాద్కు చెందిన తన మిత్రులతో కలిసి మంగళవారం ఆమె శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం మ్యూజియాన్ని తిలకించాక మాట్లాడుతూ.. అంతరించిపోతున్న గిరిజన సంస్కృతిని నేటి తరానికి తెలిసేలా కళాఖండాలను ప్రదర్శించడం అభినందనీయమన్నారు. ముఖ్యంగా గిరిజన పూర్వీకుల పనిముట్లు, చరిత్రను తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో వివరించడం పర్యాటకులకు ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు. గిరిజన మహిళలు తయారు చేసిన మిల్లెట్ బిస్కెట్లు రుచికరంగా ఉన్నాయని మెచ్చుకున్నారు. అద్భుతమైన రీతిలో మ్యూజియాన్ని తీర్చిదిద్దిన పీఓ బి.రాహుల్కు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో మ్యూజియం నిర్వాహకుడు వీరస్వామి, మాధవి తదితరులు పాల్గొన్నారు.
23నుంచి రామదాసు జయంతి ఉత్సవాలు
నేలకొండపల్లి: శ్రీసీతారామచంద్రస్వామి పరమ భక్తగ్రేసరుడైన కంచర్ల గోపన్న(భక్త రామదాసు) జయంతి ఉత్సవాలు ఆయన స్వగ్రామంలో నిర్వహించనున్నారు. ఈ మేరకు వివరాలను విద్వత్ కళాపీఠం అధ్యక్షుడు సాధు రాధాకృష్ణమూర్తి మంగళవారం వెల్లడించారు. రామదాసు జన్మస్థలమైన నేలకొండపల్లిలో ఏటా భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయం, స్థానిక భక్తరామదాసు విద్వత్ కళాపీఠం, జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యాన ఉత్సవాలు నిర్వహిస్తారు. గతంలో మాదిరిగానే ఈసారి 23నుంచి 25వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు రాధాకృష్ణమూర్తి తెలిపారు. ఈ సమావేశంలో నంచర్ల దేవీప్రసాద్, పెండ్యాల గోపాలకృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
నేడు జిల్లాకు డిప్యూటీ సీఎం రాక


