
డయేరియా నిర్మూలనే లక్ష్యం
● ఈ నెల 31 వరకు కొనసాగనున్న పక్షోత్సవాలు ● జిల్లాలో 1.18 లక్షల మందికి ఓఆర్ఎస్, జింక్ మాత్రల పంపిణీ ● ఆశా, ఏఎన్ఎం, అంగన్వాడీ వర్కర్ల సమన్వయంతో కార్యక్రమం
ఖమ్మంవైద్యవిభాగం: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యాన డయేరియా నియంత్రణ పక్షోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇంటెన్సిఫైడ్ డయేరియల్ కంట్రోల్ ఫోర్ట్నైట్ (ఐడీసీఎఫ్)లో భాగంగా 15 రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. ఈ నెల 16న కార్యక్రమం మొదలుకాగా 31వ తేదీ వరకు 0–5 ఏళ్లలోపు చిన్నారుల్లో నీళ్ల విరేచనాలను నియంత్రించేందుకు వైద్య ఆరోగ్య కృషి చేయనుంది. అందులో భాగంగా చిన్నారులకు ఓఆర్ఎస్ ప్యా కెట్లు, జింక్ మాత్రలను జిల్లాలోని సబ్సెంటర్లు, పీహెచ్సీలు, సీహెచ్సీ, అర్బన్ హెల్త్ సెంటర్లు, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చిన్నారులకు పంపిణీ చేస్తారు. గ్రామస్థాయిలో ఆశ, ఏఎన్ఎం, అంగన్వాడీ వర్కర్ల సమన్వయంతో ప్రతీ చిన్నారిని గుర్తించి వారికి ఓఆర్ఎస్, జింక్ మాత్రలు మింగించాల్సి ఉంటుంది. వర్షాకాలం రావటంతో కొత్తనీరు ప్రభావంతో ఎక్కువ శాతం చిన్నారులు ఈ సీజన్లో డయేరియా (నీళ్ల విరోచనాలు) బారిన పడతారు. శరీరంలోని ఎలక్ట్రోలైట్స్ విరేచనాల రూపంలో బయటకు పోవడతో చిన్నారులు పూర్తిగా నీరసిస్తారు. శరీర ఉష్ణోగ్రత పెరిగితే వారు మరింత నీరసించే అవకాశం ఉంటుంది. దీంతో ఓఆర్ఎస్ ద్రావణం తాగిస్తే వారికి ఉపశమనం కలుగుతుంది. శరీరం నుంచి విరేచనాల రూపంలో వెళ్లిన ఎలక్ట్రోలైట్స్ను ఓఆర్ఎస్ ద్రావణం తాగటం ద్వారా తిరిగి సమకూర్చుకునే అవకాశం ఉంటుంది.
1,18,849 మంది చిన్నారుల గుర్తింపు
జిల్లాలో 0–5 ఏళ్ల లోపు 1,18,849 మంది చిన్నారులకు ఓఆర్ఎస్, జింక్ మాత్రలను ఇవ్వనున్నారు. ఇందుకోసం 385 మంది ఏఎన్ఎంలు, 1,340 మంది ఆశా కార్యకర్తల సేవలను వినియోగించుకుంటారు. స్థానిక అంగన్వాడీల సహకారంతో ప్రతీ ఇంటికి వెళ్లి ఓఆర్ఎస్, జింక్ మాత్రలతో కలిగే లాభాలను తల్లిదండ్రులకు వివరిస్తారు. ఓఆర్ఎస్ ద్రావణంతో పాటే చిన్నారులకు జింక్ మాత్ర ఇస్తారు.
జింక్తో లాభాలు
తరచూ జబ్బు పడకుండా కాపాడుతుంది. త్వరగా నయమయ్యేలా సహకరిస్తుంది. నీళ్ల విరేచనాల సంఖ్య తగ్గుతుంది. అయినా 14 రోజుల వరకు వీటిని ఇవ్వడం ద్వారా కొన్ని నెలల వరకు మళ్లీ విరేచనాలు, న్యూమోనియా రాకుండా కాపాడుతుంది. అలాగే, శరీరంలో జింక్ అవసరాన్ని తీర్చి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. కాగా, వయస్సుల వారీగా పిల్లలకు ఈ మాత్రలను తల్లి పాలతో కానీ పరిశుభ్రమైన నీటితో కానీ ఇవ్వొచ్చు. కాగా, విరేచనాలు ప్రారంభమైన వెంటనే ఓఆర్ఎస్ ద్రావణం, జింక్ మాత్ర ఇవ్వాల్సి ఉంటుంది. చిన్నారులకు ఆరు నెలలు విరేచనాలు పెడుతున్నా కూడా తల్లిపాలే తాగించాలి.
ఒక్కరు కూడా మృతి చెందొద్దని..
డయేరియా బారిన పడి 0–5 ఏళ్లలోపు పిల్లలెవరూ మృతి చెందొద్దనే లక్ష్యాన్ని నిర్దేశించుకుని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో 1,17,810 ఓఆర్ఎస్ ప్యాకెట్లు, 1,05,535 జింక్ మాత్రలు సిద్ధం చేశారు. ఇవేకాక సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచీ అవసరమైన చోటకు సరఫరా చేయనున్నారు. ఇటుక బట్టీలు, సంచార జాతులు నివసించే ప్రాంతాల్లో చిన్నారులను గుర్తించి ఓఆర్ఎస్, జింక్ మాత్రలు అందించేందుకు వాహనాల ద్వారా వెళ్లనున్నారు.
చిన్నారులందరికీ ఓఆర్ఎస్, జింక్ మాత్రలు
జిల్లాలో గుర్తించిన 0–5 ఏళ్లలోపు చిన్నారులందరికీ ఓఆర్ఎస్, జింక్ మాత్రలు అందిస్తాం. పదిహేను రోజుల పాటు సాగే ఈ కార్యక్రమం విజయవంతమయ్యే లా ప్రణాళికలు సిద్ధం చేశాం. ఏ ఒక్కరూ డయే రియాతో మృతి చెందొద్దనే లక్ష్యంతో కృషిచేస్తున్నాం. తల్లిందడ్రులు మా సిబ్బందికి సహకరించి ఓఆర్ఎస్, జింక్ మాత్రలు పిల్లలకు ఇప్పించాలి.
–డాక్టర్ చంద్రూనాయక్, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి

డయేరియా నిర్మూలనే లక్ష్యం