
సహకార శిక్షణ ఇక ఇక్కడే..
● నాలుగు జిల్లాలకు కలిపి ఖమ్మంలో.. ● చట్టాలపై అవగాహన కల్పించడమే లక్ష్యం
ఖమ్మంవ్యవసాయం: రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు సహకార శిక్షణ కేంద్రాన్ని మంజూరు చేసింది. సహకార వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ శిక్షణా కేంద్రాలను విస్తృతం చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సహకార యూనియన్ ఆధ్వర్యాన మల్టీ జోన్–1గా హైదరాబాద్, మల్టీ జోన్–2గా వరంగల్లో మాత్రమే కేంద్రాలు కొనసాగుతున్నాయి. కానీ రాష్ట్రంలోని 60 వేల సహకార సంఘాల నిర్వాహకులకు శిక్షణ ఇవ్వడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని భావించిన ప్రభుత్వం.. కొత్తగా మరో మూడు కేంద్రాలను మంజూరు చేసింది. వీటిని ఖమ్మంతో పాటు నిజామాబాద్, మహబూబ్నగర్లో ఏర్పాటుచేసేలా ఉత్తర్వులు జారీ అయ్యాయి.
చట్టాలపై అవగాహన..
సహకార వ్యవస్థల్లో పనిచేసే ఉద్యోగులు, సిబ్బంది, అనుబంధ సంస్థలు, ప్రజాప్రతినిధులు, డైరెక్టర్లకు సహకార చట్టం, సహకార వ్యవస్థ నిర్వహణపై అవగాహన పెంచేలా ఈ కేంద్రాల్లో శిక్షణ ఇస్తారు. ప్రధానంగా ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు(పీఏసీఎస్), గొర్రెల పెంపకందారులు, మత్స్య సహకార సంఘాలు, కార్మిక సహకార సంఘాల నిర్వాహకులు, ముఖ్య కార్యనిర్వహణ అధికారులు, స్టాఫ్ అసిస్టెంట్లు, ఫీల్డ్ స్టాఫ్, డైరెక్టర్లకు ఈ కేంద్రం ద్వారా చట్టాలపై అవగాహన కల్పించనున్నారు. అలాగే, కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) ఉద్యోగులు, ప్రతినిధులకు కూడా ఇక్కడే శిక్షణ ఇవ్వనున్నారు. సహకార చట్టాలతో పాటు వ్యవస్థ నిర్వహణ, రికార్డుల నిర్వహణ, ఆడిట్, వ్యాపార లావాదేవీలే కాక నూతనంగా సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై ఉద్యోగులు, సిబ్బందికి శిక్షణ ఇచ్చేలా ఈ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
నాలుగు జిల్లాలకు కలిపి..
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల్లో సహకార ఉద్యోగులు, ప్రజాప్రతినిధులకు శిక్షణ ఇచ్చేలా ఖమ్మంలో కేంద్రాన్ని నెలకొల్పుతారు. ఖమ్మం జిల్లాలోని 76 పీఏసీఎస్లు, ఏడు జిల్లా స్థాయి సొసైటీలు, 818 ఎయిడెడ్, 434 అన్ ఎయిడెడ్ సొసైటీలతో పాటు భద్రాద్రి జిల్లాలోని 21 పీఏసీఎస్లు, ఒక జిల్లా స్థాయి సొసైటీ, 316 ఎయిడెడ్, 315 అన్ ఎయిడెడ్ సొసైటీలే కాక మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల్లోని సంస్థల ఉద్యోగులు, ప్రజాప్రతినిధులకు శిక్షణ కేంద్రం అందుబాటులోకి రానుంది. కాగా, ఈ కేంద్రం నిర్వహణకు ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సి పాల్, సంబంధిత అంశాల్లో అనుభవం కలిగిన ఫ్యాకల్టీని నియమించడమే కాక అవసరమైన భవనాన్ని కేటాయించాల్సి ఉంటుంది.