
నేడు మంత్రి పొంగులేటి పర్యటన
ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్ర రెవెన్యూ, గృహ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం జిల్లాలో పర్యటించనున్నారు. కూసుమంచి మండలం నర్సింహులగూడెం, పురియాతండా, చింతలతండా గ్రామాల్లో బీటీ రోడ్ల నిర్మాణానికి మంత్రి గురువారం సాయంత్రం శంకుస్థాపన చేస్తారు. ఆతర్వాత పోచారం, కూసుమంచిలోనూ సీసీ, బీటీ రోడ్లనిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.
23న ఒలింపిక్ డే రన్
ఖమ్మం స్పోర్ట్స్: జిల్లా యువజన, క్రీడల శాఖ, ఒలింపిక్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యాన ఈనెల 23న ఒలింపిక్ డే రన్ నిర్వహించనున్నా రు. ఈ సందర్భంగా ఖమ్మంలోని పటేల్ స్టేడియంలో బుధవారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో డీవైఎస్ఓ టి.సునీల్కుమార్రెడ్డి, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పుట్టా శంకరయ్య మాట్లాడారు. పాఠశాలల విద్యార్థులు, క్రీడా సంఘాల బాధ్యులు, యువజనులు పెద్ద సంఖ్యలో పాల్గొని రన్ను విజయవంతం చేయాలని కోరారు. ప్రతీ పాఠశాల నుంచి 150మంది విద్యార్థులను పంపించేలా డీఈ ఓకు వినతిపత్రం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి కె.క్రిస్టోఫర్బాబు, క్రీడాసంఘాల ప్రతినిధులు గోవింద్రెడ్డి, ఎన్.ఉప్పల్రెడ్డి, శ్రీనివాస్ రా వు, ఉదయ్కుమార్, ఎం.డీ.గౌస్ పాల్గొన్నారు.
సివిల్స్ కోచింగ్కు
దరఖాస్తుల ఆహ్వానం
ఖమ్మంమయూరిసెంటర్: సివిల్స్(ప్రిలిమ్స్, మెయిన్స్)కు సిద్ధమవుతున్న అభ్యర్థులకు తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యాన శిక్షణ ఇవ్వనున్నట్లు స్టడీ సర్కిల్ కార్యదర్శి కె.సత్యనారాయణ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, బీసీ–ఈ, పీడబ్ల్యూడీ నిరుద్యోగులకు శిక్షణ ఇవ్వనుండగా, తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.3లక్షలకు మించని వారు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. వచ్చేనెల 13న నిర్వహించే ప్రవేశపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తామని తెలిపారు. దరఖాస్తు విధానం, ఇతర సమాచారం కోసం కోసం టీజీఎస్సీ స్టడీ సర్కిల్లో లేదా 90320 77276 నంబర్లో సంప్రదించాలని కార్యదర్శి సూచించారు.
780 షాప్ల ద్వారా
సన్నబియ్యం పంపిణీ
ఏన్కూరు: జిల్లాలోని 780 రేషన్ షాప్ల ద్వారా కార్డుదారులకు మూడు నెలల సన్నబియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేస్తున్నామని డీసీఎస్ఓ చందన్కుమార్ తెలిపారు. ఏన్కూరులోని పలు రేషన్ దుకాణాలను బుధవారం తనిఖీ చేసిన ఆయన స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం డీసీఎస్ఓ మాట్లాడుతూ సన్నబియ్యం పంపిణీ చేస్తున్నందున లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎవరైనా బియ్యం అమ్మినా, కొనుగోలు చేసినా చర్యలు తీసపుకుంటామని స్పష్టం చేశారు. ఈనెల 30వ తేదీ వరకు బియ్యం పంపిణీ జరుగుతుందని, కార్డుదారులు ఆందోళన చెందాల్సి న పనిలేదని సూచించారు. తనిఖీల్లో ఆర్ఐలు పవన్కుమార్, నరేష్, కిరణ్ పాల్గొన్నారు.
రూ.10 ప్యాకెట్లలో విజయ పాలు, పెరుగు
ఖమ్మంవ్యవసాయం: అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వ పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ విజయ ద్వారా పాలు, పెరుగు ప్యాకెట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.10కి 150 మి.లీ. పాలు, 120 గ్రాముల పెరుగు ప్యాకెట్లను విక్రయిస్తున్నారు. ప్రైవేట్ సంస్థల పోటీని తట్టుకోవడమే పాటు ప్రజలకు అనుకూలంగా ఉండేలా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వీటిని విక్రయిస్తున్నట్లు ఖమ్మం పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ డిప్యూటీ డైరెక్టర్ కె.రవికుమార్ తెలిపారు.
27,360 మందికి
రైతుభరోసా
ఖమ్మంవ్యవసాయం: రైతుభరోసా పథకం ద్వారా రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ అవుతోంది. మూడో రోజైన బుధవారం జిల్లాలో నాలుగెకరాల వరకు భూమి కలిగిన 27,360 మంది రైతుల ఖాతాల్లో రూ.57,22,91,899 జమ చేశారు. మొత్తం 3,53,794 మందిని అర్హులుగా గుర్తించగా, ఇప్పటివరకు 2,88,151మంది రైతులకు రూ.250,67,89,542 అందాయని డీఏ ఓ ధనసరి పుల్లయ్య ఒక ప్రకటనలో తెలిపారు.

నేడు మంత్రి పొంగులేటి పర్యటన