
అటు ఉద్యోగం.. ఇటు అంత్యక్రియలు
రఘునాథపాలెం: ఉద్యోగానికి ఎంపికై నట్లు సమాచారం తెలియకుండానే యువకుడు కన్నుమూయడం ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. రఘునాథపాలెం మండలం వీవీ పాలెంనకు చెందిన బానోత్ మణిచందన్ (21) తన తండ్రి బాలాజీతో కలిసి సూర్యాపేట జిల్లా బురకచర్ల వెళ్లి వస్తూ కూసుమంచి వద్ద జరిగిన ప్రమాదంలో మంగళవారం మృతి చెందిన విషయం విదితమే. అయితే, పోలీసు, సైనిక దళాల్లో ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో శ్రమించిన మణిచందన్ ఇటీవల సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్)లో కానిస్టేబుళ్ల భర్తీకి నిర్వహించిన పరీక్షకు హాజరయ్యారు. తాజాగా విడుదలైన జాబితాలో ఆయన పేరు ఉన్నట్లు మంగళవారం ప్రకటించారు. కానీ, అప్పటికే మణిచందన్ మృతి చెందగా.. ఈ విషయం బుధవారం ఉదయం కుటుంబీకులకు తెలిసింది. విజయం సాధించినట్లు తెలుసుకోకుండానే మణిచందన్ మృతి చెందడం ఆయన కుటుంబంలో విషాదాన్ని నింపగా, బంధువులు, గ్రామస్తులు సైతం కన్నీరుమున్నీరయ్యారు.
జీసీసీ గోదాంలో
రేషన్ బియ్యం తనిఖీ
పాల్వంచరూరల్: స్థానిక గిరిజన సహకార సంస్థ(జీసీసీ) సముదాయంలోని గోదాంలో రేషన్ బియ్యం నిల్వలను రాష్ట్ర విజిలెన్స్ టాస్క్ఫోర్స్ అధికారులు అంజయ్య నేతృత్వంలోని బృందం బుధవారం తనిఖీలు నిర్వహించింది. గోదాంలోని సన్నబియ్యం రేషన్ షాపులకు ఎన్ని క్వింటాళ్లు తరలించారు.. ఎంత నిల్వ ఉన్నాయి.. అనే వివరాలతో పాటు ఆర్ఓ ఎంట్రీలను పరిశీలించారు. దమ్మపేట, భద్రాచలంలో కూడా విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించినట్లు డీటీ శ్రీనివాసరావు తెలిపారు.
శుభవార్త వినకుండానే
కన్నుమూసిన యువకుడు