
రైతువేదికల్లో వీసీ యూనిట్ల ఏర్పాటు
నేలకొండపల్లి: రాష్ట్ర ప్రభుత్వం మూడో విడత రైతు నేస్తం వీసీ (వీడియో కాన్ఫరెన్స్) యూనిట్లను సోమవారం ప్రారంభించనున్నారు. జిల్లాలో 41 రైతు వేదికల్లో కొత్తగా ఏర్పాటు చేశారు. జిల్లావ్యాప్తంగా 129 రైతు వేదికలు ఉండగా.. వాటిలో గతంలో 1, 2 విడతల్లో 21 రైతు వేదికల్లో వీసీ యూనిట్లను ఏర్పాటు చేసి రైతు నేస్తం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రైతులకు మరింత చేరువగా ఉండేందుకు ప్రతీ మండలంలో కనీసం మూడు రైతు వేదికల్లో వీసీ యూనిట్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. ఈ మేరకు జిల్లాలో మూడో విడతలో 41 వేదికల్లో వీసీ యూనిట్లకు సంబంధించి పరికరాలు ఇన్స్టాల్ చేసి, ట్రయల్ రన్ నిర్వహించారు. సోమవారం సీఎం రేవంత్రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా వీటిని ప్రారంభించనున్నారు. సీఎం జిల్లాలోని నేలకొండపల్లి, కొణిజర్ల మండలంలోని లింగగూడెం రైతు వేదికలో పాల్గొననున్న రైతులతో ముఖాముఖి మాట్లాడేందుకు జిల్లా వ్యవసాయాధికారులు ఏర్పాట్లు చేశారు. ముఖాముఖికి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డీఏఓ పుల్లయ్య అధికారులకు సూచించారు. సుర్దేపల్లి, ముజ్జుగూడెం రైతువేదికల్లో పనులను ఏఓ రాధ పరిశీలించారు.
వీవీపాలెం రైతువేదిక సందర్శన
రఘునాథపాలెం: రైతులకు శాసీ్త్రయ సాగు పద్ధతులపై అవగాహన కల్పించేందుకు వ్యవసాయ శాఖ కీలక ముందడుగు వేసిందని డీఏఓ ధనసరి పుల్లయ్య పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని వీవీపాలెం రైతువేదికను సందర్శించి వీడియో కాన్ఫరెన్స్ పనితీరును పరిశీలించారు. ఇప్పటికే జిల్లాలో 21 వీసీ యూనిట్లు ఉండగా.. తాజాగా ఏర్పాటు చేస్తున్న 41 యూనిట్లతో కలిపి మొత్తం 62 అందుబాటులోకి రానున్నాయని వివరించారు. ప్రతి మంగళవారం ‘రైతు నేస్తం’ కార్యక్రమం నిర్వహించి శాస్త్రవేత్తలు, వ్యవసాయ నిపుణులు ప్రత్యక్షంగా సలహాలు, సూచనలు ఇస్తారని చెప్పారు. కార్యక్రమంలో ఏఓ ఉమామహేశ్వరరెడ్డి, ఏఈఓ సాయిశిరణ్మయి తదితరులు పాల్గొన్నారు.