
మూడున్నర ఏళ్లలో 20 లక్షల ఇళ్లు
నేలకొండపల్లి: వచ్చే మూడున్నర ఏళ్లలో రాష్ట్రంలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. మండలంలోని గువ్వలగూడెం, కోరట్లగూడెం, మోటాపురంలో సోమవారం పర్యటించిన ఆయన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడుతూ తమ ప్రభుత్వం పేదల అభ్యున్నతే లక్ష్యంగా సంక్షేమ పథకాలు అమలుచేస్తోందని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గానికి ప్రస్తుతం 3,500 ఇళ్లు మంజూరు చేయగా దశల వారీగా అర్హులందరికీ కేటాయిస్తామని చెప్పారు. ఇప్పటికే ఉచిత విద్యుత్, గ్యాస్, బస్సు ప్రయాణం అమలవుతుండగా, ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10లక్షలకు పెంచామన్నారు. గత ప్రభుత్వం పదేళ్లలో రూ.17 వేల కోట్ల రుణమాఫీ చేస్తే... తమ ప్రభుత్వం పది నెలల్లోనే రూ.21 వేల కోట్లు మాఫీ చేసిందని వెల్లడించారు. అంతేకాక సన్న ధాన్యానికి రూ.500 బోనస్ చెల్లిస్తూ రైతులకు అండగా నిలిచామని మంత్రి తెలిపారు. ఇటీవల బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఆర్డీఓ నర్సింహారావు, మార్కెట్ చైర్మన్ వెన్నపూసల సీతారాములుతో పాటు నాయకులు శాఖమూరి రమేష్, భద్రయ్య, కొడాలి గోవిందరావు, బచ్చలకూరి నాగరాజు, జెర్రిపోతుల అంజిని, రావెళ్ల కృష్ణారావు, కడియాల నరేష్, కొమ్మినేని విజయ్బాబు, కె.హన్మంతరావు, మార్తి కోటి, మధు, వెంకటేశ్వర్లు, వాసు తదితరులు పాల్గొన్నారు.
దశల వారీగా అర్హులందరికీ మంజూరు
రాష్ట్ర మంత్రి శ్రీనివాసరెడ్డి