
ఖమ్మం రైతులు హుషారు!
ఆదర్శ రైతు రామకృష్ణతో
సీఎం రేవంత్రెడ్డి
నేలకొండపల్లి: ఖమ్మం జిల్లా రైతులు హుషారుగా ఉన్నారని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి సోమవారం రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన వీసీ ద్వారా రైతువేదికల్లో హాజరైన రైతులు, అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. ఈమేరకు నేలకొండపల్లి రైతు వేదికలో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, జిల్లా వ్యవసాయ శాఖాధికారితో పాటు చెన్నారం గ్రామానికి చెందిన ఆదర్శ రైతు మంకెన రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. ఇప్పటివరకు రైతు నేస్తం 57 వీసీలకు క్రమం తప్పకుండా హాజరైన రామకృష్ణ తనకు శాస్త్రవేత్తలు, అధికారుల సూచనలు ఉపయోగపడ్డాయని తెలిపారు. దీంతో సీఎం ఆయనను అభినందిస్తూ ‘కేబినెట్లోని కీలక పదవులన్నీ మీ జిల్లాకే ఉన్నాయి.. మీకేంటి అంతా హుషారుగా ఉన్నారు’ అని వ్యాఖ్యానించారు. రైతులు పంటలు మరింత బాగా పండించి ఆదర్శంగా నిలవాలని సూచించారు. అనంతరం కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ ప్రభుత్వ సాయాన్ని రైతులు సద్వినియోగం చేసుకుంటూ లాభదాయకమైన పంటలు పండించాలని సూచించారు. ఏడీఏ బి.సరిత, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ వెన్నపూసల సీతారాములు, రైతులు, నాయకులు ఆరెకట్ల గురవయ్య, బచ్చలకూరి నాగరాజు, జెర్రిపోతుల అంజిని, కడియాల నరేష్, కొమ్మినేని విజయ్బాబు, సూరేపల్లి రవి, గుండా బ్రహ్మం, చిలకబత్తిని వీరబాబు తదితరులు పాల్గొన్నారు.