రేపు డిప్యూటీ సీఎం భట్టి పర్యటన | - | Sakshi
Sakshi News home page

రేపు డిప్యూటీ సీఎం భట్టి పర్యటన

Jun 17 2025 5:02 AM | Updated on Jun 17 2025 5:02 AM

రేపు డిప్యూటీ  సీఎం భట్టి పర్యటన

రేపు డిప్యూటీ సీఎం భట్టి పర్యటన

ఖమ్మంమయూరిసెంటర్‌/మధిర: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క బుధవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం ఖమ్మం ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఉద్యోగుల కోసం నిర్వహించే హెల్త్‌ క్యాంప్‌ను, ఆతర్వాత విద్యుత్‌ ఆంబులెన్స్‌ను ప్రారంభిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12గంటలకు బోనకల్‌ మండలం జానకీపురం సబ్‌ స్టేషన్‌లో అభివృద్ధి పనులను ప్రారంభించాక మధిర బయలుదేరతారు. అక్కడ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి రూ.10 కోట్లతో పాత బస్టాండ్‌ స్థానంలో నిర్మించే నూతన ఆర్టీసీ బస్టాండ్‌కు భట్టి విక్రమార్క శంకుస్థాపన చేయనున్నారు.

అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

ఖమ్మం సహకారనగర్‌: ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రథమ సంవత్సరం జనరల్‌ విభాగంలో 9,600మంది పరీక్ష రాయగా 7,248మంది (75.50శాతం) ఉత్తీర్ణత సాధించారని జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాధికారి కె.రవిబాబు తెలిపారు. అలాగే, ఒకేషనల్‌ విభాగంలో 676మందికి 444మంది(65.68 శాతం) ఉత్తీర్ణులయ్యారని పేర్కొన్నారు. ద్వితీయ సంవత్సరం జనరల్‌ విభాగంలో 3,745మందికి 2,293మంది(61.23శాతం), ఒకేషనల్‌ విభా గంలో 622మందికి 337మంది (54.18శాతం) ఉత్తీర్ణత సాధించారని తెలి పారు. కాగా, ప్రథమ సంవత్సరం ఫలితాల్లో జిల్లా రాష్ట్రస్థాయిలో మూడో స్థానం, ద్వితీయ సంవత్సరంలో 11వ స్థానం దక్కించుకుందని డీఐఈఓ వెల్లడించారు.

దరఖాస్తు చేసుకోండి

ఇంటర్మీడియట్‌ ఫలితాలపై సందేహాలు ఉంటే రీ కౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌కు ఈనెల 23వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని డీఐఈఓ కె.రవిబాబు తెలిపారు. tsbie.cgg.gov.in వెబ్‌సైట్‌లోని స్టూడెంట్‌ సర్వీసెస్‌ విభాగం ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చని పేర్కొన్నారు. రీ వెరిఫికేషన్‌ ఒక్కో సబ్జెక్టుకు రూ.600, రీకౌంటింగ్‌కైతే రూ.వెయ్యి ఫీజు చెల్లించాలని డీఐఈఓ తెలిపారు.

2.88లక్షల మంది రైతుల ఖాతాల్లో ‘పెట్టుబడి’

ఖమ్మంవ్యవసాయం: వానాకాలం పంటల పెట్టుబడి సాయం(రైతు భరోసా) పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. హైదరాబాద్‌లోని ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సోమవారం జరిగిన ‘రైతు నేస్తం’ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అక్కడే ఈ పథకం ద్వారా నగదు జమ చేయడాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా పాల్గొనగా.. జిల్లాలోని రైతు వేదికల నుంచి అధికారులు, రైతులు హాజరయ్యారు. ‘రైతు భరోసా’ ద్వారా జిల్లాలో 3,53,794 మంది రైతులను అర్హులను గుర్తించగా, ఎకరాకు రూ.6వేల చొప్పున రూ. 436.84 కోట్ల సాయం వారి ఖాతాల్లో జమ కానుంది. ఈమేరకు తొలిరోజైన సోమవారం రెండు ఎకరాల లోపు భూమి కలిగిన రైతులకు పెట్టుబడి సాయం జమ చేశారు. జిల్లాలో 2,88,387మంది రైతుల ఖాతాల్లో రూ.250,84,22,381 నగదు జమ కాగా, వారి పోన్లకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేరిట ప్రభుత్వం నుంచి మెసేజ్‌ అందింది. జిల్లా రైతుల ఖాతాల్లో దశల వారీగా ఈనెల 24వ తేదీ వరకు నగదు జమ అయ్యే అవకాశముంది.

పరిశుభ్రతతోనే

డయేరియా నిర్మూలన

రఘునాథపాలెం: ఇళ్లలోనే కాక పరిసరాల్లో పరిశుభ్రత పాటించాలని, తద్వారా డయేరియా సహా ఎలాంటి వ్యాధులు దరిచేరవని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ కళావతిబాయి తెలిపారు. డయేరియా నిర్మూలన ప్రచారంలో భాగంగా సోమవారం రఘునాథపాలెం మండలం వీ.వీ.పాలెం అంగన్‌వాడీ కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. డయేరియా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్ల వినియోగంపై బాలింతలు, గర్భిణులతో పాటు స్థానికులకు అవగాహన కల్పించారు. అనంతరం జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి చందునాయక్‌, వైద్యులు బాలకృష్ణ, మౌనిక మాట్లాడగా ఉద్యోగులు పుష్పవతి, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement