
జాడ లేని వరుణుడు
మధిర: ఈ ఏడాది మే నెల రెండో వారం నుంచే అడపాదడపా వర్షాలు కురవడంతో సాగుకు అనుకూలిస్తుందని రైతులు ఆనందపడ్డారు. వాతావరణ శాఖ అధికారులు సైతం ఈ వానాకాలంలో వర్షాలు ముందస్తుగానే వచ్చే అవకాశముందని ప్రకటించారు. దీంతో రైతులు ముందుగానే దుక్కులు దున్ని పంటల సాగుకు సిద్ధమయ్యారు. పలుచోట్ల మే మూడో వారం నుంచే పొడి దుక్కుల్లో పత్తి విత్తనాలు నాటారు. ఒకటి, రెండు మంచి వర్షాలు పడగానే మొలకలు వస్తాయని భావించారు. కానీ ఈనెల రెండు వారాలు దాటినా వర్షం జాడ లేకపోవడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఒకటి, రెండు రోజుల్లో వర్షం కురవకపోతే పత్తి విత్తనాలు భూమి లోనే పాడవుతాయని.. మళ్లీ నాటాల్సి వస్తుందన్న ఆలోచన వారి ఆవేదనకు కారణమవుతోంది.
2.20లక్షల ఎకరాలకు పైగానే..
జిల్లాలో గత ఏడాది వానాకాలం సీజన్లో 2.08 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. అలాగే, మిర్చి కూడా సాగు చేయగా తెగుళ్లతో దిగుబడి రాక, సరైన ధర లభించక ఈసారి రైతులు మిర్చి వైపు పెద్దగా దృష్టి సారించడం లేదు. దీంతో ఈసారి పత్తి సాగు విస్తీర్ణం గతంతో పోలిస్తే మరో 20వేల ఎకరాలు పెరుగుతుందని భావిస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం 16,534 ఎకరాల్లో పత్తి విత్తనాలు నాటినట్లు తెలుస్తోంది. అయితే, వర్షాభావ పరిస్థితులతో ఈ గింజలు మొలకెత్తుతాయా, లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
గతనెల 20నుంచే...
జిల్లాలోని బోనకల్, రఘునాథపాలెం, మధిర, కొణిజర్ల, తల్లాడ తదితర మండలాల్లో రైతులు పత్తి విత్తనాలు నాటారు. వర్షాలు ముందుగా వస్తాయన్న ఆశతో గత నెల 20వ తేదీ నుంచి విత్తనాలు నాటడం మొలుపెట్టారు. మరికొందరు ఈనెల మొదట్లో నాటారు. ఆతర్వాత వర్షాలు లేకపోగా, నాలుగు రోజుల క్రితం చిరుజల్లులు కురవడంతో రైతుల్లో ఆశలు చిగురించాయి. కానీ మళ్లీ వర్షం జాడ లేకపోవడంతో రైతుల్లో ఆవేదన వ్యక్తమవుతోంది. ఆది, సోమవారాల్లో సాయంత్రం జిల్లాలోని పలుచోట్ల ఆకాశం మేఘావృతమైనా వర్షం మాత్రం కురవలేదు. రానున్న రెండు, మూడు రోజుల్లో మంచి వర్షం పడితేనే పత్తి విత్తనాలు మొలకెత్తే అవకాశముంది. లేకపోతే అవి భూమిలోనే పాడవుతాయని భావిస్తున్నారు. ఈ కారణంగా పలువురు రైతులు ఆశలు వదిలేసుకుని మళ్లీ నాటేందుకు పత్తి విత్తనాలు కొనుగోలు చేయాలంటే ఆర్థిక భారం తప్పదనే భావనకు వచ్చినట్లు తెలుస్తోంది.
ఎకరాకు రూ.9వేలకు పైగా పెట్టుబడి
ఎకరం భూమిలో పత్తి సాగుకు ఇప్పటికే రైతులు రూ.9వేలకు పైగా పెట్టుబడి పెట్టారు. ఫ్లవ్ దుక్కికి రూ.2వేలు, గొర్రు తోలకానికి రూ.1,600, రోటోవేటర్కు రూ.2వేలు, అచ్చు తోలకానికి రూ.1,500తో పాటు విత్తనాలకు రూ.1,700, కూలీలకు రూ.800 చొప్పున వెచ్చించారు. ఒకవేళరెండు, మూడు రోజుల్లో మంచి వర్షం కురిసి విత్తనాల మొలకెత్తకపోతే మళ్లీ కొనుగోలు, నాటించడం ఆర్థికంగా భారమవుతుందని చెబుతున్నారు.
పొడి దుక్కుల్లో పత్తి విత్తనాలు నాటిన రైతులు
ఆపై సరైన వర్షాలు లేక మొలకెత్తని వైనం
మళ్లీ నాటాలంటే భారం తప్పదని ఆవేదన

జాడ లేని వరుణుడు