బనశంకరి: బెంగళూరులో బీ–స్మైల్ ఆధ్వర్యంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులు వేగిరం చేయాలని నగరాభివృద్ధి శాఖ మంత్రి కృష్ణబైరేగౌడ తెలిపారు. సోమవారం జీబీఏ పరిధిలో పనులపై సమీక్ష జరిపారు. బెంగళూరు దీర్ఘకాలిక ట్రాపిక్ సమస్యలకు పరిష్కారం గురించి మాట్లాడారు. నగరంలో రోడ్లు సుస్థిరంగా ఉండాలి, 20–30 ఏళ్లు నాణ్యతగా ఉండే రోడ్లు నిర్మించడానికి ఈ పనులు దోహదం అవుతాయని తెలిపారు. ఒక కిలోమీటరు వైట్టాపింగ్ పనులకు సుమారు రూ.10 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. అదే అవధిలో ఐదారు సార్లు తారు రోడ్డు వేస్తే ఎక్కువ వ్యయం అవుతుందని చెప్పారు. ఇప్పటికి 196 కిలోమీటర్లు వైట్టాపింగ్ పనులు పూర్తిచేయగా కొత్తగా 126 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణ పనులు ప్రగతిలో ఉన్నాయని చెప్పారు. పాత మద్రాస్ రోడ్డు నుంచి మైసూరు రోడ్డు వరకు 22 కిలోమీటర్ల పొడవుతో తూర్పు–పశ్చిమ సొరంగ మార్గం పథకం నిర్మాణానికి టెండర్ ఆహ్వానిస్తామని తెలిపారు. నగరంలో 150 కిలోమీటర్ల పొడవైన ఎలివేటెడ్ కారిడార్ను నిర్మించాలనేది లక్ష్యమన్నారు. 275 కిలోమీటర్లు పొడవైన మెట్రోమార్గం నిర్మించాలని, దీంతో పాటు ప్రజారవాణాకు పెద్దపీట వేస్తామని తెలిపారు. జీబీఏ కమిషనర్ మహేశ్వర్రావ్, డైరెక్టర్ ప్రహ్లాద్ పాల్గొన్నారు.
150 కి.మీ. పొడవుతో ఎలివేటెడ్ కారిడార్
నగరాభివృద్ధి మంత్రి కృష్ణబైరేగౌడ


