శ్రీనివాసపురం: మామిడి పండ్లు ఎంత మధురమో, పండించేవారికి అంత కఠినంగా ఉన్నాయి. మామిడిపండ్లను రోడ్లపై రాశులుగా పోసి రైతన్నలు గోడు వెళ్లబోసుకున్నారు. మామిడి పండ్లకు ధర లేకపోవడంతో ఆవేదన పట్టలేక రోడ్డెక్కారు. మామిడి ఉత్పత్తిదారుల క్షేమాభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో సోమవారం కోలారు జిల్లాలో శ్రీనివాసపురంలో బంద్ నిర్వహించారు. ఉదయం నుంచి దుకాణాలను, ఆఫీసులను మూసివేయించిన ఆందోళనకారులు ట్రాక్టర్లలో మామిడికాయలు, పండ్లను తీసుకువచ్చి రోడ్డు మధ్యలో కుప్పగా పోసి నిరసన తెలిపారు.
కేజీకి రూ.10 ఇవ్వాలి
సంఘం జిల్లా అధ్యక్షుడు నీలటూరు చిన్నప్పరెడ్డి మాట్లాడుతూ మామిడి రైతులు ప్రతి యేటా ఏదో ఒక రకంగా నష్టపోతున్నారని, ఏసారి పంట బాగున్నా, ధర లేదని తెలిపారు. మామిడి రైతులకు ప్రభుత్వం కేజీ రూ.10 మద్దతు ధరను అందించి ఆదుకోవాలన్నారు. ఎమ్మెల్యే జికె వెంకట శివారెడ్డి మాట్లాడుతూ సాగుదారులు తీవ్రంగా నష్టపోతున్నారు, ప్రభుత్వం చేయూతనివ్వాలన్నారు. అదే మాదిరిగా కోలారు నగరంలోనూ రైతులు నిరసన తెలిపారు. జేసీబీలతో మామిడిపండ్లను రోడ్డుపై పోసి నినాదాలు చేశారు.
ధర కరువై కోలారు జిల్లా రైతుల ఆగ్రహం


