మండ్య: ఆధునిక ఆరోగ్య సంరక్షణ రంగంలోని సంక్లిష్ట సవాళ్లను ఎదుర్కోవడానికి వివిధ రంగాల సహకారం, పరిశోధనలు ఆవశ్యకమని గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ అన్నారు. మండ్య జిల్లాలోని నాగమంగళలో ఉన్న ఆదిచుంచనగిరి విశ్వవిద్యాలయం, ఆదిచుంచనగిరి ఇన్స్టిట్యూట్ ఫర్ మాలిక్యులర్ మెడిసిన్ (ఎయిమ్స్) ఆధ్వర్యంలో జరిగిన ‘అనువర్తిత పరిశోధనల కోసం ఆరోగ్య శాస్త్రాలలో అంతర్విభాగ విధానాలు‘ అనే అంతర్జాతీయ సదస్సును గవర్నర్ ప్రారంభించి ప్రసంగించారు. సుమారు 1800 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ మఠం విద్య, ఆరోగ్యం, సామాజిక సేవలు గణనీయమని అభినందించారు. క్యాన్సర్, మధుమేహం, గుండె జబ్బులు, అంటువ్యాధులు, మానసిక ఆరోగ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో, ఒకే రంగం ద్వారా పరిష్కారాలను కనుగొనలేమని ఆయన అభిప్రాయపడ్డారు. వైద్య శాస్త్రం, బయో టెక్నాలజీ, ఏఐ, బయో ఇన్ఫర్మేటిక్స్, ప్రజారోగ్యం, ఇంజనీరింగ్ వంటి వేర్వేరు రంగాలలోని నిపుణుల మధ్య సహకారం ద్వారా సమర్థవంతమైన పరిష్కారాలను కనుగొనగలమని పేర్కొన్నారు. కోవిడ్ మహమ్మారి సమయంలో శాస్త్రవేత్తలు, వైద్యులు, బయో టెక్నాలజిస్టులు, గణాంకవేత్తలు, పాలకుల కృషితో వ్యాక్సిన్ను కనుగొన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మలానందనాథ స్వామి, మంత్రి శరణప్రకాష్ పాటిల్, వైద్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.
గవర్నరు గెహ్లాట్


