రాయచూరు రూరల్: నగరంలో యువకుడు దారుణ హత్యకు గురైన కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ అరుణాంగ్శు గిరి తెలిపారు. సోమవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కుల్సుంబీ కాలనీలో తిరుపతి అనే యువకుడి తల, మొండెంను తీసుకుని దుండగులు పరారైన కేసును పశ్చిమ స్టేషన్ పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను పట్టుకున్నట్లు తెలిపారు. తిరుపతి ఇంటిలో మూడు రోజుల క్రితం అవేశ్(26), రాజు(26) అనే ఇద్దరు మిత్రులతో కలిసి మందు పార్టీ చేసుకున్నాడని, ఆ సమయంలో వాగ్వాదం జరిగి తిరుపతిని పాత కక్షలతో దారుణంగా హత్య చేశారని తెలిపారు. డీఎస్పీ శాంతవీర, సీఐ మహేష్ పాటిల్లున్నారు.


