కోలారు: నగరంలోని ముళబాగిలు రోడ్డు చెరువుకట్టపై వెలసిన శ్రీ దక్షిణామూర్తి దేవాలయంలో మామిడి రైతులు పడిన కష్టానికి మంచి ధరలతో ఫలితం దక్కాలని ప్రార్థిస్తూ శనివారం స్వామివారికి 10001 మామిడి కాయలతో విశేష అలంకరణ చేసి పూజలను నిర్వహించారు. 108 టెంకాయలు కొట్టి కొబ్బరినీళ్ల అభిషేకం చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
బిడది రైతులూ.. భూములివ్వద్దు
● కేంద్ర మంత్రి కుమారస్వామి
బనశంకరి: బిడది టౌన్షిప్ గురించి స్పష్టంగా చెప్పాను. రైతుల నుంచి సారవంతమైన భూములను స్వాదీనం చేసుకోవడానికి ఒప్పుకోను అని కేంద్రమంత్రి హెచ్డీ కుమారస్వామి అన్నారు. శనివారం బెంగళూరులతో విలేకరులతో మాట్లాడుతూ సోమవారం అన్ని ఆధారాలను విడుదల చేస్తానని తెలిపారు. రైతులకు ఎమ్మెల్యేల ద్వారా చెక్కులు పంపిస్తున్నారు, రూ.2.30 కోట్ల చెక్కులను ఇచ్చి రైతులను ప్రలోభపెడుతున్నారు, ఈ డబ్బును 20 ఏళ్ల వరకు బ్యాంకులో ఎఫ్డీ పెడితే వచ్చేది రూ.40 లక్షల వడ్డీ, కానీ అదే భూమిని కాపాడుకుంటే దీని విలువ రూ.20 కోట్లు అవుతుంది. రైతులు, ఎమ్మెల్యేలు అర్థం చేసుకోవాలి అని ఆయన అన్నారు.
రూ.100 కోట్లు ఇస్తారని...
క్రాస్ ఓటింగ్పై స్పందిస్తూ నియోజకవర్గంలో పనులకు రూ.50 కోట్ల నుంచి 100 కోట్ల నిధులు లభిస్తాయని కొందరు ఎమ్మెల్యేలు వెళ్లి ఉండవచ్చు అని అన్నారు. బీజేపీ, జేడీఎస్ మధ్య చిచ్చుపెట్టడం కాంగ్రెస్ ప్రధాన అజెండా అని, కానీ తమ మధ్య ఇబ్బంది లేదని అన్నారు.
చిక్క వద్ద ప్రమాదం..
ఇద్దరు దుర్మరణం
దొడ్డబళ్లాపురం: హిట్ అండ్ రన్ ఘటనలో ఇద్దరు యువకులు బలైన సంఘటన చిక్కబళ్లాపురం తాలూకాలో బెంగళూరు– హైదరాబాద్ 44వ హైవేలో హొన్నేనహళ్లి గేట్ వద్ద జరిగింది. చిక్కబళ్లాపురం తాలూకా బాదగానహళ్లికి చెందిన వరుణ్ (22), జీవన్ (22) అనే యువకులు మరణించారు. అక్కడే ఓ లాజిస్టిక్ కంపెనీలో పని చేస్తున్న ఇద్దరూ అర్ధరాత్రి పని ముగించుకుని బైక్పై గ్రామానికి వస్తుండగా దారిలో ఏదో వాహనం ఢీకొని వెళ్లిపోయింది. తీవ్రగాయాలతో యువకులు దుర్మరణం చెందారు. చిక్క పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కాసేపట్లో ఇంటికి చేరుకుంటామని చెప్పిన పిల్లలు కానరాని లోకాలకు వెళ్లిపోయారని కుటుంబ సభ్యులు విలపించారు.


