హొసపేటె: విద్యార్థులకు మానసిక ఒత్తిడిని తొలగించటంలో యోగా ప్రముఖ పాత్ర పోషిస్తుందని టీబీ డ్యాం ప్రభుత్వ పీఎల్సీ పాఠశాల హెచ్ఎం లలితమ్మ తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శనివారం టీబీ డ్యాం పీఎల్సీ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఏర్పాటు చేసిన యోగాభ్యాస కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ముఖ్యంగా పరీక్షల సమయంలో ధ్యానం విద్యార్థులకు మనో నిబ్బరం కలిగిస్తుందన్నారు. యోగాతో శారీరంగా బలంగా ఉండటమే కాకుండా మానసికంగా దృఢంగా ఉంటారన్నారు. యోగాపై విద్యార్థులకు అవగాహన ఎంతో అవసరమన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి, హేమలత, నిర్మల, రవికుమార్, ఈరప్ప, మంజుల, శారద, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


