హుబ్లీ: చిన్న కారణంగా రెండు కుటుంబాలు పరస్పరం కొట్లాడుకొని హత్యాయత్నంతో పాటు చంపుతామని బెదిరించిన ఘటన హుబ్లీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. గదగ్ రోడ్డు గూడ్స్షెడ్ సమీప నివాసి శివానందపై పాత ద్వేషంతో అదే వీధికి చెందిన గురునాథ్ అనే వ్యక్తి ఆనంద్ అనే మరో వ్యక్తితో కలిసి చాకుతో ఛాతీపై పొడిచి హత్యాయత్నానికి ప్రయత్నించారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. బానివీధిలో మాట్లాడుకుంటూ నిలబడిన వేళ కొంచెం పక్కకు జరగండి అన్నందుకు శివానంద, శ్రీకాంత్ కర్రలతో దాడి చేసి చంపుతామని బెదిరించినట్లు గురునాథ్ ఫిర్యాదులో పేర్కొన్నారు.
బైక్ అదుపు తప్పి
చోదకుడు మృతి
హుబ్లీ: ౖబెక్ అదుపు తప్పడంతో చోదకుడు మృతి చెందిన ఘటన ధార్వాడ జిల్లా కురుడకేరి గ్రామం వద్ద చోటు చేసుకుంది. శబ్బి గ్రామానికి చెందిన మంజునాథ(30) మృతుడు. కంప్లికొప్ప నుంచి కురుడకేరి వైపునకు వేగంగా వెళుతుండగా బైక్ అదుపు తప్పి కిందపడ్డాడు. దీంతో తల, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. తక్షణమే కేఎంసీ ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం కలగలేదు. అతడు మృతి చెందాడని హుబ్లీ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
రైల్వే స్టేషన్లో గంజాయి జప్తు
హుబీ: హుబ్లీ నగర రైల్వే స్టేషన్ నాలుగో ప్లాట్ఫాంలో గదగ్ వైపునకు వెళ్లే మార్గంలో ఎకై ్సజ్ అధికారులు దాడి చేసి 5 కేజీల గంజాయిని జప్తు చేశారు. హుబ్లీ ఎకై ్సజ్ డిప్యూటీ సూపరిండెంటెండ్ నేపథ్యంలో బందోబస్తు చేస్తున్న వేళ ఆ ప్లాట్ఫాంలో ప్రయాణికులు కూర్చొనే కట్టపై పెట్టిన సంచిలో 5.56 కేజీల గంజాయి దొరికింది. పోలీసులు ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసుకున్నారు.
మహిళ అరెస్టు
మరో ఘటనలో 815 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకొని ఓ మహిళను అరెస్ట్ చేశారు. కోళివాడ ఈద్గా దగ్గర గంజాయిని విక్రయిస్తున్న మహిళను పోలీసులు అరెస్ట్ చేసి రూ.40 వేలు విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కే.మంజవ్వ అనే మహిళ ఆకులు, పూలు, విత్తనాల మిశ్రమంతో ఉన్న గంజాయి అమ్ముతుండగా హుబ్లీ గ్రామీణ పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.
కొనసాగుతున్న
అక్రమణల తొలగింపు
● కొనసాగుతున్న ఆక్రమణల తొలగింపు
● 1.33 ఎకరాల ప్రభుత్వ స్థలం కబ్జా
● జేసీబీలతో ఖాళీ చేసిన అధికారులు
సాక్షి,బళ్లారి: నగరంలో ఆక్రమణల తొలగింపు కొనసాగుతూనే ఉంది. శనివారం నగరంలోని హవంబావి ప్రాంతంలో సిరుగుప్ప రహదారి కాలువ సమీపంలో కొందరు వ్యక్తులు దర్జాగా కోట్లాది రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని, ఇళ్లు కట్టుకుని బాడుగలకు ఇచ్చుకుని, నెలనెలా వేలాది రూపాయలు బాడుగలు తీసుకుని కాజేసిన ప్రభుత్వ స్థలాన్ని అధికారులు గుర్తించారు. రెవెన్యూ, పోలీసులు, తహసీల్దార్ తదితరులు పెద్ద సంఖ్యలో మోహరించి 1.33 ఎకరాల్లో నిర్మించిన వివిధ కట్టడాలను జేసీబీలతో తొలగించారు. సర్వే నంబర్–275లో ఉన్న ఈ ప్రభుత్వ భూమిని స్థానికంగా ఉన్న ఓ నాయకుడు ఆక్రమించుకుని యథేచ్చగా స్వాధీనం చేసుకున్నారు. కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని తప్పుడు రికార్డులు సృష్టించుకుని తమదే భూమి అనే విధంగా కట్టడాలు నిర్మించి బాడుగకు ఇవ్వడం వెలుగు చూసింది. ఎట్టకేలకు ఆక్రమణలు తొలగించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రజా సమస్యలపై స్పందించండి
రాయచూరు రూరల్: అధికారులు ప్రజా సమస్యలపై స్పందించాలని సమాచార హక్కు కమిషన్ కలబుర్గి డివిజన్ కమిషనర్ వెంకటసింగ్ సూచించారు. శనివారం రాయచూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జగజ్యోతి బసవేశ్వర అంబేడ్కర్ భవన్లో అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లాలో 2 వేలకు పైగా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయన్నారు. వివిధ చట్టాలు, ఇతర అంశాలపై అధికారులకు హెచ్చరికలు చేశారు. ప్రజలకు సరైన సమాచారం కల్పించక పోవడంపై అధికారులపై చిందులు తొక్కారు. సమావేశంలో జిల్లాధికారి పూవిత, ఎస్పీ అరుణాంగ్షు గిరి, జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్, నగరసభ అదనపు కమిషనర్ శివకుమార్, సురేంద్రబాబు, నందిత, శరణమ్మలున్నారు.
చౌకడిపోలో ఆకస్మిక తనిఖీ
రాయచూరు రూరల్: పేదలకు చౌకడిపోల నుంచి ఆహార ధాన్యాలను సక్రమంగా పంపిణీ చేయాలని ఆహార పౌర సరఫరాల శాఖాధికారి నాసీర్ అహ్మద్ పేర్కొన్నారు. శనివారం బైరూన్ కిల్లాలోని ప్రియదర్శిని చౌకధర దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి డీలర్ శివలింగకు సూచనలు చేశారు. ప్రజల నుంచి ఫిర్యాదులు రాకుండా ప్రతి నెల ధాన్యాలను పంపిణీ చేయాలన్నారు. 50 అంతోద్యయ, 500 బీపీఎల్ కార్డుదారులకు అందిస్తున్న సేవలను పరిశీలించారు.


