హుబ్లీ: నన్ను బెదిరించి ఆరు నెలల క్రితం ముఫిస్ వీడియో రికార్డు చేసుకున్నాడు. ఇప్పుడేమో ఆ దృశ్యాలను వైరల్ చేస్తున్నాడని, ఈ విషయంలో కొందరు రాజకీయ నేతలు తమ పబ్బం గడుపుకున్నారని హుబ్లీ లవ్ జిహాద్ బాధితురాలు ఆరోపించారు. ఆమె మీడియాకు ఇచ్చిన ప్రకటనలో జైల్లో ఉంటూనే నిందితుడు ముఫిస్, అలాగే అతడి స్నేహితుల నుంచి కేసును మార్చే కుట్ర చేస్తున్నారు. ఎఫ్ఐఆర్ నమోదు అయ్యాక పాత వీడియో విడుదల చేసి కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. నిందితుడు ముఫిస్, అలాగే ప్రముఖ హాల్తాజ్ హోటల్ యజయానిపై బాధితురాలు ఆక్రోశం వెళ్లగక్కారు. తాను స్వచ్ఛందంగానే ముఫిస్తో సంబంధాన్ని వదులుకున్నాను. అతడితో ఉన్నప్పుడు బలవంతంగా ఇస్లాం మతం ఆచరణ గురించి నన్ను ఒత్తిడి చేసేవాడు. నాకు బ్రెయిన్ వాష్ చేసి వారు చెప్పినట్లుగానే నడుచుకొనేలా చేశారు. దీంతో నేను అతడి స్నేహానికి బ్రేకప్ చెప్పాను. అందుకే అతడికి వ్యతిరేకంగా కేసు నమోదు చేశానని ముఫిస్ నుంచి లవ్ జిహాద్కు బలి అయిన బాధిత యువతి వివరించారు.
పట్టపగలే ఇంట్లో చోరీ
హొసపేటె: హగరిబొమ్మనహళ్లి పట్టణంలోని బోవి కాలనీలోని ఓ ఇంట్లో సోమవారం ఓ నిందితుడు పట్టపగలే చోరీ చేసి పారిపోయిన ఘటన జరిగింది. ఈ ఘటన హగరిబొమ్మనహళ్లి వాసులను హడలెత్తించింది. పగటిపూట దొంగతనం చేసి పారిపోతున్న దృశ్యాలు సీసీ టీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ఇంట్లో ఎవరూ లేరని గమనించిన దొంగ తాళం పగలగొట్టి ఈ నేరానికి పాల్పడ్డాడు. బోవి కాలనీలో నివాసమంటున్న జగదీష్ ఇంట్లో ఈ దొంగతనానికి పాల్పడ్డాడు. దొంగ ఇంట్లోంచి రూ.15 వేల నగదును దొంగలించాడు. ఘటనపై హగరిబొమ్మనహళ్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
అభివృద్ధి పనుల పరిశీలన
బళ్లారిటౌన్: తాలూకాలోని కొళగల్లు గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులను గ్రామీణ ఎమ్మెల్యే నాగేంద్ర సోదరుడు వెంకటేష్ ప్రసాద్ పరిశీలించారు. గ్రామ శివారులో రెండు చోట్ల రూ.4 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న వంతెనల పనులను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఈ పనులను నాణ్యతగా, చురుకుగా నిర్వహించాలని కాంట్రాక్టర్ నాగరాజుకు సూచించారు. అంతకు ముందు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఎస్డీఎంసీ కమిటీ అధ్యక్ష, ఉపాధ్యక్ష బాధ్యతల స్వీకార కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ పాఠశాలలను ఎమ్మెల్యే నిధులతో దత్తత తీసుకొని అభివృద్ధి పరుస్తారని, దీనికి ప్రజలు సహకరించాలన్నారు. ఈ నిధులలతో పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు ఎక్కువ శ్రద్ధ చూపి ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు గోవర్ధనరెడ్డి, రాజేష్, గాదిలింగనగౌడ, ప్రభురెడ్డి, సిద్దమ్మనహళ్లి ఉలెప్ప, మల్లేశప్ప, నాగరాజ్రెడ్డి, నాగిరెడ్డి, అంజినప్ప, శివరామ, ఉచ్చీరప్ప, చిదానంద, చంద్రప్ప, ఎర్రిస్వామి, గాదిలింగ, షణ్ముఖ, శివమూర్తి తదితరులు పాల్గొన్నారు. అనంతరం నూతన ఎస్డీఎంసీ పదాధికారులను సన్మానించారు.
గవర్నర్ను రీకాల్ చేయాలి
రాయచూరు రూరల్: రాష్ట్ర గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ను రీకాల్ చేయాలని కర్ణాటక రక్షణ వేదిక సభ్యులు డిమాండ్ చేశారు. సోమవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకుడు వినోద్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్రానికి వ్యతిరేకంగ నడుచుకుంటున్నారని పదో తరగతి పరీక్షల్లో మూడో భాష హిందీకి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రాష్ట్రపతి, ప్రధానమంత్రులకు లేఖలు రాశామన్నారు. ప్రతి చిన్న విషయంలో రాష్ట్ర సర్కార్కు తలనొప్పిగా మారిన గవర్నర్ను రీకాల్ చేయాలని కోరుతు జిల్లాధికారి నితీష్ ద్వారా రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పించారు.
పీడీఓను సస్పెండ్ చేయరూ
రాయచూరు రూరల్: సగమకుంట పీడీఓను సస్పెండ్ చేయాలని స్వాభిమాని కర్ణాటక రక్షణ వేదిక డిమాండ్ చేసింది. సోమవారం టీపీ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకులు రాము మాట్లాడారు. పీడీఓ కరెప్పను విధుల నుంచి తొలగించాలని కోరుతూ టీపీ ఈఓ చంద్రశేఖర్ పవార్కు వినతిపత్రం ఇచ్చారు.


