రాయచూరు రూరల్: కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్న గడినాడు ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలు పరిష్కరిస్తామని అదనపు జిల్లాధికారి శివానంద హామీ ఇచ్చారు. సోమవారం రాయచూరు తాలూకా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. గత 50 ఏళ్ల నుంచి గడినాడు పాఠశాల సమస్యలపై నిరంతరం ఆందోళన చేస్తున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం చొరవతో సమస్యలను పరిష్కరించి గడినాడు ప్రాంత విద్యార్థులకు ఉన్నత విద్య, నిరుద్యోగులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామన్నారు. 1956లో ఫజల్ అలీ కమిషన్ నివేదిక ఆధారంగా భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా విభజనతో ఈ పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. హాస్టల్ సౌకర్యం, రవాణా సౌకర్యాలను కల్పించాలని జేఏసీ నాయకులు అధికారులకు వివరించారు. పీయూ అధికారి సోమశేఖరప్ప, తహసీల్దార్ సురేష్ వర్మ, సాంఘీక సంక్షేమ శాఖాధికారులు ప్రవీణ్, మోనప్ప, ఈరణ్ణ కోస్గి, రంగస్వామి, జేఏసీ నాయకులు అమర దీక్షిత్, రామలింగప్ప, నిజాముద్దీన్, నాగభూషన్, కిషోజుఏ కుమార్, నాగరాజ, రవి, నాగేంద్ర, రేష్మా షబ్బీర్లున్నారు.
అదనపు జిల్లాధికారి శివానంద హామీ
5 శాతం రిజర్వేషన్ అమలుకు చర్యలు


