రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం వెనుక బడిన జిల్లాల అభివృద్ధికి తోడు రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పథకాలను జారీ చేస్తోంది. సర్కార్ ఆశయ సాధన దిశగా పని చేయాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి శూన్య సాధన చేసిన నిదర్శనాలున్నాయి. వేపవి కాలంలో పశువులకు తాగునీరు, పశు గ్రాసం లభించడం కష్టమని భావించి ప్రభుత్వం గోశాలల నిర్మాణం చేపట్టింది. పేరుకు మాత్రమే గ్రామాల్లో గోశాలల నిర్మాణాలు చేపట్టారు. 2023–24వ సంవత్సరంలో రాయచూరు తాలూకా జంబలదిన్ని గ్రామంలో జెడ్పీ, జిల్లా యంత్రాంగం, పశు సంవర్థక శాఖల ఆధ్వర్యంలో రూ.51.55 లక్షలతో గోశాలను నిర్మించారు. గోబర్ గ్యాస్ ఉత్పత్తికి వీలుగా కేఆర్డీఎల్ సంస్థ నేతృత్వంలో రూ.11.30 లక్షల వ్యయంతో గోబర్ గ్యాస్ ప్లాంట్ను నిర్మించి గాలికొదిలేశారు.
కనిపించని పచ్చదనం
గోశాల చుట్టు పచ్చదనం పెంపొందించేందుకు మొక్కలు నాటాలని ఆదేశాలున్నా వాటిని మూలన పడేశారు. రైతులకు ఉపయోగపడాల్సిన గోశాల నిరుపయోగంగా మారింది. గ్రామానికి 2 కి.మీ.ల దూరంలో గోశాలను నిర్మించినా ఫలితం లేకుండా పోయింది. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో మూడు నెలల పాటు పశువులకు పశుగ్రాసం, తాగునీటికి కటకట ఏర్పడుతుందని గ్రహించి సర్కార్ సదాశయంతో గోశాలను నిర్మించినా జీపీ అధికారులు నిర్వహణపై పూర్తిగా నిర్లక్ష్యం వహించారు. దాదాపు రూ.63 లక్షలతో నిర్మించిన గోశాలలో జంబలదిన్ని గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామాలకు చెందిన పశువులకు నీడనివ్వాల్సిన గోశాల నిర్మాణం చేపట్టి మూడేళ్లు గడుస్తున్నా ఇంత వరకు గోశాలను ఉపయోగించిన దాఖలాలు లేవని గ్రామస్తుస్థులు ఆంజనేయ, తిమ్మప్ప వాపోయారు.
గోవులకు రక్షణ కరువు
నిరుపయోగంగా గోశాల
నెరవేరని ప్రభుత్వ ఆశయం


