బళ్లారిఅర్బన్: క్యాన్సర్ వ్యాధిని ప్రారంభ దశలో గుర్తిస్తే పూర్తిగా నయం చేయడం సాధ్యమని బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రి సర్జికల్ అంకాలజీ, రోబోటిక్ సర్జరీ విభాగం కన్సల్టెంట్ డాక్టర్ దేవీష్ బల్లాళ్ తెలిపారు. సోమవారం పత్రికా భవనంలో ఆయన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యాధి నిర్ధారణలో ఆలస్యం జరిగితే రోగుల జీవన అవకాశాలు తగ్గడమే కాకుండా, వారి జీవిత మనుగడపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. కర్ణాటకలో పెరుగుతున్న క్యాన్సర్ ముప్పుపై అవగాహన, ముందస్తు గుర్తింపు అవసరం అనే అంశం గురించి తెలిపారు. రాష్ట్రంలో నమోదవుతున్న క్యాన్సర్ కేసుల్లో సుమారు 25 శాతం పొగాకు వాడకంతో సంబంధం ఉన్నవేనని తెలిపారు. ప్రతి సంవత్సరం దాదాపు 22 వేల కేసులు నమోదవుతుండగా వాటిలో నేరుగా పొగాకుతో సంబంధించినవి ఎక్కువగా ఉండటం ఆందోళనకరమని పేర్కొన్నారు.


