
నదులు, వాగులు ఉధృతం
బనశంకరి: రాష్ట్రంలో కొడగు, హాసన్, చిక్కమగళూరు, ఉత్తర కన్నడ, ఉడుపి, శివమొగ్గ, కారవార, బెళగావి తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో నివాస ప్రాంతాలు జలమయం కాగా నదులు పొంగిపొర్లుతున్నాయి. కావేరి నది ఉప్పొంగి మడికెరి దగ్గర భాగమండల త్రివేణి సంగమం పూర్తిగా మునిగిపోయింది. హారంగి జలాశయం నుంచి 18 వేల క్యూసెక్కులు నీటిని కావేరి నదికి విడుదల చేశారు. కావేరినది జన్మస్థలమైన తల కావేరిలో నీటిమట్టం ఇనుమడించింది. త్రివేణి సంగమ ఉద్యానవనం, భగండేశ్వర దేవస్థానం ఆవరణలోకి నీరుచొరబడింది. అయ్యంగేరి, సణ్ణపులికొట్టు రోడ్డు మునిగిపోయాయి.
సప్తనదుల జోరు
మహారాష్ట్రలో, బెళగావి పరిసరాల్లో పశ్చిమ కనుమల్లో కుండపోత వల్ల సప్తనదులు పొంగిపొర్లుతున్నాయి. కృష్ణ, వేదగంగ, దూద్ గంగ నదుల్లో జోరు పెరిగింది. చిక్కోడి పరిధిలో ఆరు వంతెనల పైనుంచి నదులు ప్రవహిస్తున్నాయి, 12 గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. కృష్ణా నది ఇన్ఫ్లో కూడా రోజురోజుకు పెరుగుతోంది. ఖానాపుర అడవుల్లో భారీ వర్షాల వల్ల మలప్రభ నది పొంగి పొర్లుతోంది.
చిక్కమగళూరు జిల్లాలో
చిక్కమగళూరు కొప్ప తాలూకా హోసూరు గ్రామంలో అర్ధరాత్రి వర్షానికి గిడ్డప్ప అనే వ్యక్తి ఇల్లు కూలిపోయింది. చెట్టు పడి మరో ఇల్లు దెబ్బతినింది. తరికేరి తాలూకా పర్యాటక స్థలమైన కలత్తగిరి ఫాల్స్ ఉదృతంగా జాలువారుతుండటంతో పర్యాటకులు వస్తున్నారు. శృంగేరి తాలూకా నెమ్మారు, తనికోడు వద్ద కొండచరియలు విరిగిపడగా, హైవే 169లో 20వ తేదీ ఉదయం వరకు వాహన సంచారాన్ని నిలిపివేశారు.
తుంగా నది ప్రవాహం
శివమొగ్గలో తుంగానది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇప్పటికే డ్యామ్ నుంచి 37 వేల క్యూసెక్కులను విడుదల చేశారు. నది పరిసర ప్రదేశాల్లో ముంపు భయం నెలకొంది. హొసనగర హులికల్ ఘాట్ వద్ద కొండచరియ పడిపోయాయి.
నిండుగా హేమావతి
హాసన్ జిల్లాలో హేమావతి డ్యాంలో నీరు అంతకంతకు పెరుగుతోంది. కొన్ని గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. దిగువన ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు తెలిపారు. కలబురిగిలో గుడూరు గ్రామంలో ఇంటి గోడ కూలి చంద్రశేఖర్ అనే బాలుడు చనిపోయాడు.
కరావళి, మల్నాడు జిల్లాల్లో
ఆగని వర్షాలు
నిండుతున్న జలాశయాలు
గ్రామాలకు ముంపు భయం
కబిని ఫుల్లు
మైసూరు: కేరళలోని వయనాడ్, పశ్చిమ కనుమల అటవీ ప్రాంతాల్లో వర్షాల తీవ్రత పెరగడంతో హెచ్డి కోట తాలూకాలోని బీచనహళ్లిలో కబిని జలాశయానికి ఇన్ఫ్లో పెరిగింది. 24 వేల క్యూసెక్కుల నీరు వస్తుంటే, 25 వేల క్యూసెక్కులను వదిలేస్తున్నారు. వర్షం కొనసాగుతుండడంతో జలాశయం నిండే అవకాశముంది. నీటి మట్టం 17.57 టిఎంసీలకు చేరింది. ఇంకో రెండు అడుగులు వేచి చూసి, గేట్లు ఎత్తే అవకాశముంది. నదికి ఇరువైపులా గ్రామాల ప్రజలు సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని ఇంజనీర్లు తెలిపారు.

నదులు, వాగులు ఉధృతం

నదులు, వాగులు ఉధృతం

నదులు, వాగులు ఉధృతం

నదులు, వాగులు ఉధృతం