
ఘనంగా గంగమ్మ జాతర
చింతామణి: పట్టణంలోని వినోభ కాలనీ ప్రాంతవాసులు గంగాభవాని అమ్మవారి జాతరను భక్తిశ్రద్ధలతో ఆచరించారు. శక్తి దేవతలయిన గంగమ్మ, పీళేకమ్మ, సప్పలమ్మ, నెరిడమ్మ, పూజమ్మ, మారమ్మ, చౌడేశ్వరి, శ్రీ వీరాంజనేయస్వామి ఆలయాల్లో పూజలు జరిపారు. వందలాదిగా కోళ్లు, మేకలను బలి ఇచ్చి విందు భోజనాలు చేసుకున్నారు.
విద్యుత్ రంగంలో మెరుపులు
● సీఎం సిద్దరామయ్య
శివాజీనగర: విద్యుత్ సరఫరా శాఖలో ఖాళీగా ఉన్న 35 వేల ఉద్యోగాలను దశలవారీగా భర్తీ చేస్తామని, శాఖలో 532 మంది పారిశుధ్య కార్మికులను పర్మినెంట్ చేస్తామని సీఎం సిద్దరామయ్య చెప్పారు. నగరంలో కేపీటీసీఎల్ ఉద్యోగుల సంఘం వజ్ర మహోత్సవాన్ని ప్రారంభించి మాట్లాడారు. పాత పెన్షన్ పథకం (ఓపీఎస్) తీసుకొస్తామని మేనిఫెస్టోలో ప్రకటించామని, అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఆసియాలోనే ప్రప్రథమంగా 1902లో కర్ణాటకలో, 1905లో బెంగళూరులో ప్రథమ విద్యుత్ సరఫరా కంపెనీ ఆరంభమైనట్లు తెలిపారు. 1906లో తొలిసారిగా ప్యాలెస్కు విద్యుత్ వచ్చిందని, నేటికి 34 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తిని చేస్తున్న రాష్ట్రమనే గౌరవం పొందామని అన్నారు. వ్యవసాయానికి పగలు కూడా 7 గంటలు విద్యుత్ సరఫరా చేసే శక్తిని కలిగి ఉన్నామన్నారు. 60 వేల మెగావాట్ల ఉత్పత్తిని చేరినప్పుడే ఇది సాధ్యపడుతుందన్నారు.
పిల్లల ముందు
గొడవలు పడొద్దు
చిక్కబళ్లాపురం: పిల్లల ముందు తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితిలోనూ గొడవలు పడకూడదని ఆదిచుంచనగిరి పీఠాధిపతి నిర్మలానందనాథ స్వామీజీ సూచించారు. బుధవారం ఇక్కడి వీరాంజనేయస్వామి ఆలయంలో చిన్నపిల్లలకు అక్షరాభ్యాస వేడుకలో పాల్గొని ప్రసంగించారు. శిక్షకుల మాదిరిగా పోషకులు బాలలను సరైన మార్గంలో నడిపించాలని అన్నారు. ఇంట్లో పిల్లల ముందు జగడాలు పడవద్దని అన్నారు. ఉన్నత విద్యామంత్రి ఎంసి సుధాకర్ మాట్లాడుతూ పిల్లల విద్యార్జనలో తల్లి పాత్ర మహత్తరమైనది అన్నారు. తల్లి ప్రారంభంలో మంచి దారిలో నడిపిస్తే అత్యున్నత స్థానాన్ని అలంకరించవచ్చునని అన్నారు. బిజిఎస్ పాలకమండలి సభ్యులు డాక్టర్ శివరామరెడ్డి, మంగళానందనాథ స్వామీ, సివిల్ జడ్జి శిల్ప, తహశీల్దార్ అనిల్, బాలల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

ఘనంగా గంగమ్మ జాతర