
స్కూలు బస్సు పల్టీ
● 20 మంది పిల్లలకు గాయాలు
● మైసూరు వద్ద ప్రమాదం
మైసూరు: స్కూల్ బస్సు బోల్తా పడగా, 20 మంది పిల్లలకు గాయాలైన ఘటన జిల్లాలోని హుణసూరు తాలూకా హబ్బనకుప్పె గ్రామం వద్ద రోడ్డు మలుపులో జరిగింది. బుధవారం ఉదయం పిరియాపట్టణ సమీపంలోని కంపలాపురకు చెందిన ఎంఆర్ నోబుల్ స్కూల్ బస్సు వివిధ గ్రామాల నుంచి 20 మంది పిల్లలను ఎక్కించుకుని స్కూలుకు బయలుదేరింది. ఆ సమయంలో ముందు చక్రం పంచరై వాగులోకి పల్టీ కొట్టింది. పిల్లలు భయంతో ఆర్తనాదాలు చేయసాగారు. స్థానికులు చేరుకుని బస్సులో నుంచి పిల్లలను వెలికితీశారు. హుణసూరు ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందింపజేశారు. తీవ్రంగా గాయపడిన కొందరిని మైసూరులోని కేఆర్ ఆస్పత్రికి తరలించారు. ఎవరికీ ప్రాణాపాయం లేదు. బస్సు డ్రైవర్కు కూడా గాయాలయ్యాయి. అతనిని కూడా ఆస్పత్రిలో చేర్పించారు. గాయాలైన పిల్లలను చూసి తల్లిదండ్రులు విలపించారు.
నదిలోకి దూకి
ఉపాధ్యాయుడు ఆత్మహత్య
మైసూరు: ఉపాధ్యాయుడొకరు కపిలా నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లాలోని నంజనగూడులో జరిగింది. మండ్య తాలూకా బెళ్తంగనహుండికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు చంద్రు (48) నంజనగూడుకు కారులో వచ్చారు. జాతీయ రహదారి–766లో కపిలా వంతెనపై కారును నిలిపి చెప్పులు, మొబైల్, తాళం చెవిని కారులోనే వదిలి అక్కడే వంతెన పైనుంచి నదిలోకి దూకేశాడు. డోర్లు తెరిచి ఉన్న కారు చాలాసేపటి నుంచి ఉండటాన్ని గమనించిన కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు చేరుకుని పరిశీలించారు. మండ్య రిజిస్ట్రేషన్ కలిగిన కారు గురించి సమాచారం సేకరించగా యజమాని వివరాలు తెలిశాయి నంజనగూడు నగర స్టేషన్ ఎస్ఐ రవీంద్ర, తిమ్మయ్య మూడు తెప్పలు, గజ ఈతగాళ్ల సాయంతో కపిలా నదిలో గాలించగా, చంద్రు మృతదేహం ఒక కిలోమీటర్ దూరంలోని అయ్యప్ప స్వామి ఆలయం వద్ద లభించింది. మరణోత్తర పరీక్షకు తరలించారు. మృతునికి జెడ్పీ ఉద్యోగి అయిన భార్య భాగ్య, మనోజ్ పాటిల్, భాను ప్రకాష్ అనే ఇద్దరు కుమారులున్నారు. చంద్రు ఆత్మహత్యకు స్పష్టమైన కారణం ఏమిటో ఇంకా తెలియరాలేదు.

స్కూలు బస్సు పల్టీ