
జూలై 1 నుంచి ఇంటింటికీ ఈ–ఖాతా
శివాజీనగర: బెంగళూరులో అతిపెద్ద స్థాయిలో ఆస్తి ఖాతా కార్యక్రమాన్ని జూలై 1 నుంచి ఆరంభించనున్నట్లు డిప్యూటీ సీఎం డీ.కే.శివకుమార్ తెలిపారు. బెంగళూరు అభివృద్ధి అంశాలపై నగర పరిధిలోని మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కుమారపార్కులో ప్రభుత్వ నివాసంలో ఆయన భేటీ జరిపారు. తరువాత విలేకరులతో మాట్లాడిన ఆయన బెంగళూరులో ఈ–ఖాతా ఆందోళనను చేపడతాము. నగరంలో 25 లక్షల ఇళ్ల ఆస్తులు ఉండగా, ఇందులో 5 లక్షల మంది ఆస్తిపత్రాలను అప్లోడ్ చేశారు. మరో 20 లక్షల మందివి పెండింగ్ ఉన్నాయి. అందుచేత ఈ–ఖాతా ఆందోళనను ఆ నెలంతా జరిపి, ఆస్తులు, యజమానుల వివరాలను రూపొందిస్తామని తెలిపారు. ఇందుకోసం ఇంటింటికి వెళ్లి జాగృతి కల్పించటంతో పాటుగా ప్రచారాన్ని నిర్వహిస్తామన్నారు. ఆస్తుల యజమానులు తమ ఆధారాలను అందజేసి ఈ–ఖాతా చేసుకోవచ్చని తెలిపారు. రెవెన్యూ శాఖ మంత్రి కృష్ణభైరేగౌడ నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా నిర్వహించి 25 వేల ఆస్తుల ఖాతాలను సిద్ధం చేసినట్లు తెలిపారు.
శుభ్రతకు సహాయవాణి
రెవెన్యూ ఆస్తులకు బీ–ఖాతా ఇచ్చే విషయమై సమావేశంలో చర్చించామని డీసీఎం తెలిపారు. స్వచ్ఛ బెంగళూరు పథకం ద్వారా చెత్త తొలగింపునకు ప్రాధాన్యతనిచ్చినట్లు చెప్పారు, ప్రజలు చెత్త ఉన్న స్థలం ఫోటో తీసి దానిని సహాయవాణి ఫోన్ నంబర్కు పంపితే ఒక వారంలో ఆ చెత్తను తొలగిస్తారని అన్నారు. అలాగే నగరంలో రోడ్ల గుంతల మరమ్మతులు చేపడతామన్నారు. ఎమ్మెల్యేలు వారి నిధులతో పనులు చేయించాలన్నారు.
త్వరలో బీబీఎంపీ ఎన్నికలు
గ్రేటర్ బెంగళూరును అతి త్వరలో అస్తిత్వంలోకి తీసుకొచ్చి బీబీఎంపీకి తక్షణమే ఎన్నికలు జరుపుతామని డీసీఎం చెప్పారు. గ్రేటర్ బెంగళూరు కింద 4–5 పాలికెలను ఏర్పాటు చేసి ఎన్నికలు జరపాలని మంత్రులు, ఎమ్మెల్యేలు సూచించారు. ఈ సమావేశంలో మంత్రులు కే.జే.జార్జ్, కృష్ణభైరేగౌడ, భైరతి సురేశ్, జమీర్ అహమ్మద్ ఖాన్, ఎమ్మెల్యేలు ఎం.కృష్ణప్ప, రిజ్వాన్ హర్షద్ తదితరులు పాల్గొన్నారు.
బెంగళూరులో బృహత్ అభియాన
ఆన్లైన్లో ఆస్తుల డాక్యుమెంట్లు
అప్లోడ్ చేయాలి
డిప్యూటీ సీఎం శివకుమార్ వెల్లడి