
క్వారీ గొడవ.. కాల్పుల రభస
● ఒకరికి తూటా గాయాలు
దొడ్డబళ్లాపురం/ గౌరిబిదనూరు: క్వారీ మైనింగ్ విషయంలో వివాదం తలెత్తి పిస్టల్తో కాల్పులు జరిపిన సంఘటన చిక్కబళ్లాపురం జిల్లా మంచేనహళ్లి గ్రామం వద్ద చోటుచేసుకుంది. సకలేశ్కుమార్ అనే వ్యక్తి చికెన్ రవి అనే వ్యక్తి మీద ఫైరింగ్ చేశాడు. వివరాలు.. క్వారీ కోసం మంచేనహళ్లి వద్ద సకలేశ్కుమార్ ఏర్పాట్లు చేసుకున్నాడు. క్రషర్ లారీలు తిరగడానికి రోడ్డు వేస్తుండగా స్థానికులతో కలిసి చికెన్ రవి అనే వ్యక్తి ధర్నా చేపట్టాడు. తన క్వారీకి అడ్డు రావద్దని అతనితో సకలేశ్కుమార్ వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో సకలేశ్కుమార్ తలకు గాయమైంది. దీంతో పిస్టల్ తీసి మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఒక బుల్లెట్ చికెన్ రవి కాలి తొడలోకి దిగింది. జనం వెంటనే రవిని తక్షణం చిక్కబళ్లాపుర జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలంలో యుద్ధ వాతావరణం నెలకొంది. సకలేశ్ కుమార్ మాజీ ఎమ్మెల్సీ వైఎన్ నారాయణస్వామికి దగ్గరి బంధువు అవుతారు. మంచేనహళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
నిందితులు అరెస్టు
చిక్కబళ్లాపురం: జిల్లా ఎస్పీ కుశాల్ చౌక్సి మాట్లాడుతూ సకలేశ్ను మంచేనహళ్లి పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపారు. ఎంపీ కె సుధాకర్ మాట్లాడుతూ తన 50 ఏళ్ల అనుభవంలో జిల్లాలో ఎప్పుడు కాల్పుల సంఘటన ఎప్పుడూ జరగలేదు, ఇది కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమని ఆరోపించారు. నేను ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు ఇదే క్వారీ విషయం నా వద్దకు వచ్చింది, క్వారీ ఏర్పాటుకు నేను సమ్మతించలేదు, ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే దీనికి కారణం. వారికి తెలియకుండా ఎలా జరుగుతుందని అని మండిపడ్డారు. కాల్పులను ఖండిస్తూ గ్రామస్తులు పోలీసు స్టేషన్ వద్ద ధర్నా చేయడంతో ఉద్రిక్తత ఏర్పడింది.
నేడు మహదేశ్వర బెట్టకు సీఎం
మైసూరు: సీఎం సిద్దరామయ్య గురువారం నుంచి మూడు రోజుల పాటు చామరాజనగర, మైసూరు జిల్లాల్లో పర్యటించనున్నారు. గురువారం ఉదయం 11.30 గంటలకు బెంగళూరు నుంచి మలెమహదేశ్వర బెట్టకు హెలికాప్టర్లో సీఎం చేరుకుని మధ్యాహ్నం 12 గంటలకు ప్రత్యేక కేబినెట్ భేటీలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 3 గంటలపైన మలెమహదేశ్వర స్వామి క్షేత్ర అభివృద్ధి ప్రాధికార సమావేశంలో పాల్గొని రాత్రికి బెట్ట మీదే బస చేస్తారు. శుక్రవారం ఉదయం బెట్టలోని సుత్తూరు శాఖామఠాన్ని సందర్శిస్తారు. సాయంత్రం 5 గంటలకు మైసూరుకు వచ్చి ప్రభుత్వ అతిథిగృహంలో మైసూరు పాలికె అధికారులతో భేటీ అవుతారు. ఇంకా పలు కార్యక్రమాలలో పాల్గొంటారు.
ఉగ్ర దాడిపై ఆగ్రహం
తుమకూరు: జమ్మూ కశ్మీర్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడిని ఖండిస్తూ తుమకూరు నగరంలో బీజేపీ నేతలు నిరసన తెలిపారు. నగర ఎమ్మెల్యే జ్యోతి గణేశ్ నేతృత్వంలో టౌన్హాల్ సర్కిల్లో ఆందోళన చేశారు. పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరూ ఇలాంటి భయానక ఘటనలను ముక్త కంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు. మరోవైపు ఈ నెల 25న తుమకూరులో జరగాల్సిన బీజేపీ జనాక్రోశ యాత్ర వాయిదా పడింది. మృతుల గౌరవార్థం జనాక్రోశ యాత్రను వాయిదా వేసినట్లు తెలిపారు.
దొంగ అరెస్టు, అర్ధ కేజీ
బంగారు నగలు సీజ్
కోలారు: కోలారు జిల్లా ముళబాగిలు పట్టణం, గ్రామీణ ప్రాంతాలలో కలిపి మొత్తం 9 చోట్ల దొంగతనాలకు పాల్పడిన దొంగని పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రూ. 52 లక్షల విలువ చేసే 557 గ్రాముల బంగారు నగలు, కేజీ వెండి సొత్తుని స్వాధీనం చేసుకున్నారు. దొంగ బెంగళూరు బనశంకరికి చెందిన సయ్యద్ అఫ్సర్ (37) అని తెలిపారు. వరుసగా జరిగిన దొంగతనాలపై విచారణ చేపట్టి దొంగను అరెస్టు చేయడంలో సఫలమయ్యారు.

క్వారీ గొడవ.. కాల్పుల రభస

క్వారీ గొడవ.. కాల్పుల రభస