కరీంనగర్రూరల్: మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని సీపీ గౌస్ ఆలం పిలుపునిచ్చారు. బుధవారం కరీంనగర్రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో దుర్శేడ్ జెడ్పీ పాఠశాలలో చేపట్టిన ‘మాదక ద్రవ్యాల వినియోగం– యువతపై ప్రభావం’ అనే కార్యక్రమంలో సీపీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్ధులు మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారి ఉజ్వల భవిష్యత్ను నాశనం చేసుకోవద్దన్నారు. గంజాయి, సిగరేట్, మద్యానికి దూరంగా ఉండాలని సూచించారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని విద్యార్థులతో ప్రతిజ్ఙ చేయించారు. రూరల్ ఏసీపీ విజయ్కుమార్, సీఐ నిరంజన్రెడ్డి, యాంటీ నార్కోటిక్ సీఐ రఫీక్ఖాన్, ఎస్సై లక్ష్మారెడ్డి, కార్పొరేటర్ రవీందర్, ప్రధానోపాధ్యాయుడు రత్నాకర్ పాల్గొన్నారు.
కరీంనగర్ కార్పొరేషన్: నగరాభివృద్ధి నిరంతర ప్రక్రియ అని మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. నగరపాలకసంస్థ 13వ డివిజన్ మార్కండేయనగర్లో నూతనంగా నిర్మించిన ఓపెన్ జిమ్ను బుధవారం ప్రారంభించారు. ఒకటో డివిజన్ బృందావన్కాలనీ రూ.29.70 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. నగరంలోని అన్ని డివిజన్లలో ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. 13వ డివిజన్ కార్పొరేటర్ తేళ్ల లక్ష్మి, ఒకటవ డివిజన్ కార్పొరేటర్ బారి అపర్ణ, డీఈ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
కరీంనగర్సిటీ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘అన్న అక్క మెంటర్షిప్’ టీచింగ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రాంలో భాగంగా బుధవారం నగరంలోని ఎస్సారార్ కళాశాలలో రెండవ రోజు బీబీఏ విద్యార్థులకు ‘ఏఐ, డిజిటల్ లెర్నింగ్’ పై శిక్షణ ఇచ్చినట్లు ప్రిన్సిపాల్ కల్వకుంట రామకృష్ణ తెలిపారు. శిక్షకులు జడల రమేశ్, ప్రేమ్ చంద్, చౌదరి, వేములవాడ శ్రీనివాస్, మహేందర్ ఆర్టిఫి షియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ అండ్ అప్లికేషన్స్, కోడింగ్, పైతాన్ లాంగ్వేజ్, డిజిటల్ లర్నింగ్, కంప్యూటేషనల్ థింకింగ్, ఎమర్జింగ్ టెక్నాలజీస్, టెక్నాలజీని సురక్షితంగా, బాధ్యతాయుతంగా వినియోగించడం తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ పి.నితిన్, కామర్స్ విభాగాధిపతి టి.రాజయ్య, ఉన్నత విద్య ఐకాస చైర్మన్ డాక్టర్ కడారు సురేందర్రెడ్డి, కళాశాల నోడల్ అధికారులు మధు, రాజేశ్, ఎం.మల్లారెడ్డి, ఎం.ఆంజనేయులు పాల్గొన్నారు.
కొత్తపల్లి(కరీంనగర్): యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణను విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ విద్యుత్ భవన్ ఆవరణలో రెండోరోజు బుధవారం భోజన విరామ సమయంలో విద్యుత్ ఉద్యోగులు నిరసన చేపట్టారు. యాదాద్రి పవర్ ప్లాంట్లోని కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్, యాష్హ్యాండ్లింగ్ ప్లాంట్లను ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీజీపీపీజేఏసీ, టీజీఎన్పీడీసీఎల్ నాయకులు రంగు వెంకటనారాయణ, గాదం రఘు, కొలుపుల రాజు, యుగంధర్, సంపత్ , శ్రీనివాస్ పాల్గొన్నారు.


