కరీంనగర్ కార్పొరేషన్: రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పని చేయాలని డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. రాహుల్గాంధీ జన్మదినం సందర్భంగా నగరంలోని తెలంగాణచౌక్లో కేక్ కట్ చేశారు. 2029 ఎన్ని కల్లో రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమన్నారు. సివిల్ హాస్పిటల్ వద్ద ఆర్ష మల్లేశం కేక్ కట్ చేశారు. ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో దన్గర్వాడీ పాఠశాలలో పెన్నులు అందించా రు. కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్, ఆరెపల్లి మోహన్, ఆకారపు భాస్కర్ రెడ్డి, మడుపు మోహన్, పులి ఆంజనేయులు, కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి ఉన్నారు.
ప్రజల భాగస్వామ్యంతోనే పరిశుభ్రత
కరీంనగర్ కార్పొరేషన్: ప్రజల భాగస్వామ్యంతోనే నగర పరిశుభ్రత సాధ్యపడుతుందని మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా చేపడుతున్న పారిశుధ్య పనులను శుక్రవారం నగరంలోని 20,56 డివిజన్లలో పర్యవేక్షించారు. ప్రజలు ఎక్కడ పడితే అక్కడ చెత్తను వేయకుండా, నగరపాలకసంస్థకు సహకరించాలని కోరారు. డ్రైనేజీల్లో చెత్తను వేయడం వల్ల మురుగునీరు సులువుగా ముందుకు వెళ్లలేక, నిలిచిపోయి ప్రజలను ఇబ్బంది పెడుతుందన్నారు. డ్రైనేజీల్లో సిల్ట్ను పూర్తిగా తొలగించాలని, మురుగునీళ్లు సాఫీగా ముందుకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అధికారులు, పారిశుద్ధ్య సిబ్బంది సమన్వయంతో పనిచేసి శానిటేషన్ కార్యక్రమాలను మరింత వేగవంతం చేయాలన్నారు. ప్రజల నుంచి వచ్చే సమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్పొరేటర్లు తాటి ప్రభావతి, పర్వతం మల్లేశం పాల్గొన్నారు.
ఐటీఐ అడ్మిషన్లకు దరఖాస్తు గడువు పెంపు
కరీంనగర్టౌన్: ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ, ఐటీసీలలో 2026–27 సంవత్సరానికి మొదటి దశ అడ్మిషన్ల దరఖాస్తు గడువు ఈనెల 30 వరకు పెంచినట్లు కరీంనగర్ ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ కె.అశోక్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 10వ తరగతి పాసైన ఆసక్తిగల విద్యార్థులు సంబంధిత వెబ్సైట్లో ఎస్ఎస్ిసీ మెమో, బోనోఫైడ్, కుల ధ్రువీకరణ పత్రాలతో ఈనెల 30వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చుని పేర్కొన్నారు. వివరాలకు 85004 61506 నంబర్ను సంప్రదించాలని సూచించారు.
బెస్ట్ అవైలబుల్ స్కూళ్లలో లాటరీ ద్వారా ఎంపిక
కరీంనగర్టౌన్: జిల్లాలోని బెస్ట్ అవైలబుల్ స్కూళ్లలో 2026–27 విద్యాసంవత్సరం ప్రవేశానికి లాటరీ ద్వారా ఎంపిక జరుగుతుందని వెనుకబడిన తరగతుల అభివృద్ధిశాఖ ఉపసంచాలకుడు వై.తిరుపతిరావు ఒక ప్రకటనలలో తెలిపారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్లో 1వ తరగతి (నాన్–రెసిడెన్షియల్), 5వ తరగతి(రెసిడెన్షియల్)లో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులతో సహ వారి తల్లిదండ్రులు ఈనెల 23న ఉదయం 11 గంటలకు కలెక్టరేట్ ఆడిటోరియంలో హాజరు కావాలని సూచించారు.
జాతీయస్థాయి సర్పంచ్ సంవాద్లో విజయం
రామడుగు: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జాతీయస్థాయి సర్పంచ్ సంవాద్ పోటీల్లో కరీంనగర్ జిల్లా రామడుగు మండలం కోరటపల్లి, వెలిచాల గ్రామాల సర్పంచ్లు ప్రథమ, తృతీయ స్థాయిల్లో నిలిచారని ఎంపీడీవో రాజేశ్వరి, ఎంపీవో శ్రావణ్కుమార్ తెలిపారు. కేంద్రం నిర్వహిస్తున్న నెలవారీ పోటీల్లో ఆత్మ నిర్భర్ మహిళ అంశంపై జరిగిన జాతీయస్థాయి పోటీలలో కోరటపల్లి సర్పంచ్ మేకల మహేశ్వరి(ప్రథమ), వెలిచాల సర్పంచ్ వీర్ల నర్సింగరావు (తృతీయ)స్థాయిలో నిలవడం జరిగిందని తెలిపారు. ఈ గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి, మహిళ సాధికారత ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తాయని తెలిపారు.


