కరీంనగర్ అర్బన్: ప్రకృతిని కాపాడుకునేందుకు ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కరీంనగర్ డీర్పార్క్లో కలెక్టర్ చిత్రా మిశ్రా, సీపీ గౌస్ఆలంతో కలిసి మొ క్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ గతేడాది సిద్దిపేట జిల్లాలో అటెండర్ నుంచి కలెక్టర్ వరకు దాదాపు 11వేల మంది ఒకేసారి మొక్కలు నాటార ని గుర్తుచేశారు. జిల్లాలోనూ తదనుగుణంగా కార్యక్రమం చేపట్టాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లలో కరివేపా కు, మునగ, జామ మొక్కలు నాటాలని కోరారు. అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, చీఫ్ కన్జర్వేటివ్ ఆఫీసర్ క్షితిజ, మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్, డీఎఫ్వో సత్యనారాయణ పాల్గొన్నారు.
ప్రతీ గింజ కొంటా.. ఆందోళన వద్దు
జిల్లాలో ఇటీవల కురిసిన అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ పురోగతిపై కలెక్టర్ చిత్రా మిశ్రా, సివిల్ సప్లయ్స్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రలతో ఫోన్లో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 317 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటివరకు 261 కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తయ్యాయని, మిగిలిన కేంద్రాల్లో ఉన్న సుమారు 9,500 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని త్వరితగతిన మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు.


