కరీంనగర్ క్రైం: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని జిల్లా జడ్జి శివకుమార్ అన్నారు. కోర్టు ఆవరణలో శుక్రవారం పర్యావరణ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కోర్టు ఆవరణలో మొక్కలు నాటారు. ఎస్.శివకుమార్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి నైతిక బాధ్యత అన్నారు. ఇందుకోసం కోసం అందరూ సంకల్పంతో ముందుకు సాగాలన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కె.రాణి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్, జనరల్ సెక్రటరీ సీహెచ్.కిరణ్ కుమార్, లీగల్ ఏడ్ డిఫెన్స్ కౌన్సిల్ తణుకు మహేశ్, అటవీశాఖ రేంజ్ ఆఫీసర్ జి.శ్రీనివాస్ పాల్గొన్నారు.
న్యాయవాదుల సహకార సంఘం ఏర్పాటు
కరీంనగర్ బార్ అసోసియేషన్ న్యాయవాదుల పరస్పర సహకార సంఘం కార్యాలయాన్ని జిల్లా జడ్జి ఎస్.శివకుమార్ శుక్రవారం ప్రారంభించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి సీహెచ్ కుమార్ ఆధ్వర్యంలో కోర్టు భవన సముదాయంలో అడ్వకేట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో–ఆపరేటివ్ సొసైటీని ఏర్పాటు చేశారు. త్వరలోనే సొసైటీ పూర్తిస్థాయిలో న్యాయవాదులకు అందుబాటులోకి వస్తుందని లక్ష్మణ్ తెలిపారు. బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు బండ శివకుమార్, బొడ్ల గీతారాణి, కార్యదర్శి సుంకె దేవకిషన్, ట్రెజరర్ బొజ్జ స్వామి పాల్గొన్నారు.


