ఉమ్మడి జిల్లాలో జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్ల బదిలీ | - | Sakshi
Sakshi News home page

ఉమ్మడి జిల్లాలో జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్ల బదిలీ

Apr 25 2026 7:42 AM | Updated on Apr 25 2026 7:42 AM

జగిత్యాలజోన్‌: ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని పలు కోర్టుల్లో పనిచేస్తున్న జ్యుడీషియల్‌ మెజి స్ట్రేట్‌లను బదిలీ చేస్తూ హైకోర్టు రిజిస్ట్రార్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్‌లో పనిచేస్తున్న షీరీనాను రంగారెడ్డి జిల్లా ఎల్‌బీనగర్‌, జగిత్యాలలో పనిచేస్తున్న శ్రీనిజ కోహిర్కర్‌ను పెద్దపల్లి జిల్లా గోదావరిఖని, మెట్‌పల్లిలో పనిచేస్తున్న ఎన్‌.అరుణ్‌కుమార్‌ను రంగారెడ్డి జిల్లా అమన్‌గల్‌, వేములవాడలో పనిచేస్తున్న కె.జ్యోతిర్మయిని ఖమ్మం, సిరిసిల్లలో పనిచేస్తున్న ఎ.ప్రవీణ్‌ను ఖమ్మం, గోదావరిఖనిలో పనిచేస్తున్న డి.వెంకటేశ్‌ను గద్వాలకు బదిలీ చేశారు. అలాగే, ఖమ్మంలో పనిచేస్తున్న వి.మాధవిని మెట్‌పల్లి, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో పనిచేస్తున్న యశ్వంత్‌సింగ్‌ను కరీంనగర్‌, రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో పనిచేస్తున్న అపర్ణను పెద్దపల్లి జిల్లా మంథనికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

హైకోర్టు జడ్జీలను కలిసిన బార్‌ అసోసియేషన్‌ సభ్యులు

కరీంనగర్‌ క్రైం: హైకోర్టు జడ్జిలను నూతనంగా ఎన్నికై న కరీంనగర్‌ బార్‌ అసోసియేషన్‌ ప్రతి నిధులు అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్‌ ఆధ్వర్యంలో శుక్రవారం కలిశారు. కరీంనగర్‌ పోర్ట్‌ పోలియో జడ్జి జస్టిస్‌ తుకారాంజీ, జస్టిస్‌ ఇవి. వేణుగోపాల్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించారు. బార్‌ కౌన్సిల్‌ సభ్యులు పొన్నం అశోక్‌, సుజాతను కలిశారు. కోర్టు భవనాలు త్వరగా పూర్తిచేసేలా చూడాలని కోరగా, సానుకూలంగా స్పందించారు. ప్రధాన కార్యదర్శి సీహెచ్‌.కిరణ్‌ కుమార్‌, ఉపాధ్యక్షుడు బండ శివకుమార్‌, బి.గీతారాణి, జా యింట్‌ సెక్రటరీ ఎస్‌.దేవకిషన్‌, ట్రెజరర్‌ బి. స్వామి, లైబ్రరీ సెక్రటరీ బి.రాజేశ్‌, స్పోర్ట్స్‌ అండ్‌ కల్చరల్‌ సెక్రటరీ బి.శ్రీకాంత్‌ పాల్గొన్నారు.

కో ఆప్షన్‌ ఎన్నికపై గోప్యమెందుకు..?

కరీంనగర్‌ కార్పొరేషన్‌: నగరపాలకసంస్థ కో ఆప్షన్‌ ఎన్నికను చట్టవిరుద్ధంగా నిర్వహిస్తూ ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ఖూనీ చేస్తోందని మాజీ మేయర్‌, 58వ డివిజన్‌ కార్పొరేటర్‌ రవీందర్‌ సింగ్‌ ధ్వజమెత్తారు. శుక్రవారం నగరంలోని ఓ హోటల్‌లో మాట్లాడుతూ కో ఆప్షన్‌ ఎన్నిక ప్రక్రియను ఎందుకు రహస్యంగా ఉంచుతున్నారో బీజేపీ పాలకవర్గం, కమిషనర్‌, కలెక్టర్‌ చెప్పాలని డిమాండ్‌ చేశారు. శనివారం ఎన్నిక నిర్వహించనుండగా, ఇప్పటివరకు ఎవరు పోటీచేస్తున్నారో కూడా కార్పొరేటర్లకు తెలియకపోవడం సిగ్గుచేటన్నారు. 46 మంది పోటీ చేస్తున్నారనే సమాచారం పత్రికల ద్వారా నే తెలిసిందని, అధికారికంగా మాత్రం ఎలాంటి వివరాలు ఇవ్వకపోవడం దారుణమన్నారు. ఓట్లు వేయాల్సిన కార్పొరేటర్లకు ఎవరు పోటీచేస్తున్నారో తెలియకపోవడమేమిటని ప్రశ్నించారు. మున్సిపల్‌ యాక్ట్‌–2019 సెక్షన్‌ 11 ప్రకారం ప్రస్తుత జనరల్‌బాడీలో ప్రాతినిధ్యం లేని మైనార్టీ వర్గాలకు అవకాశం కల్పించాలని నిబంధనలు ఉన్నప్పటికి, పూర్తిగా పక్కనపెట్టారన్నారు. నాయకులు తుల భాస్కర్‌రావు, జక్కని ఉమాపతి, మహమ్మద్‌ ఇస్తియాక్‌ అహ్మద్‌, మైకేల్‌ శ్రీనివాస్‌, దండబోయిన రాము, కెమసారం తిరుపతి పాల్గొన్నారు.

ఉపాధి పనులు తనిఖీ

కొత్తపల్లి(కరీంనగర్‌): కొత్తపల్లి మండలం నాగులమల్యాలలో శుక్రవారం గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను డీఆర్‌డీవో శ్రీధర్‌ తనిఖీ చేశారు. ఉపాధి హామీ కూలీలకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. వేసవిలో ఎండ తీవ్రతను అధిగమించేందుకు జాగ్రత్తలు పాటించాలన్నారు. మంచినీటి సౌకర్యం, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, ప్రాథమిక చికిత్స కిట్లు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. సర్పంచ్‌ లక్కాకుల చంద్రకళ మోహన్‌రావు, ఏపీవో శోభారాణి, కవిత, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement